గ్రేడింగ్ చేసి ముంబైకి ఎగుమతి
కొల్లాపూర్ మామిడితోటల్లోనే మకాం
నేరుగా తోటలనే కొన్న దళారులు
ఈ ఏడాది తగ్గిన దిగుబడి,ధర
టన్ను మామిడి ధర రూ.65వేలు
కల్వకోలు తోటల నుంచి సెర్ప్ కొనుగోలు
కొల్లాపూర్, మార్చి 29: దేశీవాళి రకానికి పెట్టింది పేరు కొల్లాపూర్ మామిడి. రుచి,తీపి,నాణ్యతలోనూ ఇక్కడి మామిడిపండ్లకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతీయ మార్కెట్లో పేరు ప్రఖ్యాతలుగాంచిన కొల్లాపూర్ మామిడి రకాలు ఎగుమతికి సిద్ధమవుతున్నాయి. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో తోటల్లోనే మామిడి సేకరించి బెంగళూర్కు ఎగుమతి చేస్తున్నారు. సెర్ప్కు దీటుగా ముంబై ఫ్రూట్ మార్కెట్ ప్రైవేట్ వ్యాపారులు దళారులను రంగంలోకి దించారు. పెద్దకొత్తపల్లి అడ్డాగా పోటాపోటీగా రైతులతో ధర మాట్లాడుకొని తోటల్లోకి వెళ్లి కాయలను కూలీలతో కోయించి నేరుగా పెద్దకొత్తపల్లి గోదాంకు తరలిస్తూ అక్కడి నుంచి ముంబైకి ఎగుమతి చేస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలోనే మామిడి అధిక దిగుబడినిచ్చే కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాలు. కొల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు 26వేల ఎకరాల్లో మామిడి సాగు విస్తీర్ణం ఉందని ఉద్యానవనశాఖ అధికారుల అంచనా. తెలంగాణ ప్రభుత్వం చొరవతో మామిడి రైతులు ఇబ్బందులు గురికాకుండగా సెర్ప్ అండగా నిలుస్తున్నది. ప్రస్తుతం పెద్దకొత్తపల్లి వెలుగు ఏపీఎం అరుణ నేతృత్వంలో సెర్ప్ ద్వారా కల్వకోలు ప్రాంతంలో మామిడితోటల రైతుల నుంచి నేరుగా సేకరిస్తూ బెంగళూర్ మార్కెట్కు ఎగుమతి చేస్తున్నారు. సెర్ప్ రైతులకు సమకూర్చుతున్న ప్రయోజనాలను కూడా ముంబై ప్రూట్ మాఫియా కల్పిస్తూ మామిడి టన్ను ధర రూ.65వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
రారాజు..కొల్లాపూర్ మామిడి
దేశంలోనే కొల్లాపూర్ మామిడి పండ్లకు ప్రత్యేకత ఉంది. పన్నెండేండ్ల కిందట ఢిల్లీలో నిర్వహించిన జాతీయ మామిడిపండ్ల ప్రదర్శనలో కొల్లాపూర్ మామిడి రారాజుగా నిలిచింది. ప్రతి ఏటా రైతులు మామిడి సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ పోతుండడంతో ప్రస్తుతం కొల్లాపూర్ ప్రాంతం గ్రీన్ బెల్ట్గా మారింది. నియోజకవర్గంలోని కోడేరు, పెద్దకొత్తపల్లి, వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల పరిధిలో సుమారు 26వేల ఎకరాల్లో లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యావనశాఖ అధికారులు చెబుతున్నారు. పండ్లతోటల సాగుకు తెలంగాణ సర్కార్ రాయితీలను అధికంగా ఇవ్వడంతో ప్రతి ఏడాది మామిడి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.
సురభిరాజా వారి తోటలను చూసే..
కొల్లాపూర్ సురభిరాజాకు 50ఏండ్ల నుంచే సుమారు 60ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. అప్పట్లో ఇతర రాష్ర్టాల నుంచి మేలైన రకం మామిడి మొక్కలను తెచ్చి నాటించారు. చెట్లు పెద్ద ఎత్తున విస్తరించి ఆశించిన దిగుబడినిచ్చేవి. కానీ హైబ్రీడ్ రకం మామిడి వచ్చిన తరువాత పాత తోటలను తొలగించి కొత్త రకమైన బేనిషాన్, రాణిపసంద్, కలెక్టర్, మాల్గోవా, తోతాపరి, నీలాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు సాగు చేశారు. రాజు సాగుచేసిన తోటల దిగుబడిని చూసి ఈ ప్రాంత రైతులు అదే రకం మామిడి సాగుచేసుకుంటూ వస్తున్నారు.
రైతు ఆర్థికాభివృద్ధి
ఐదు ఎకరాల్లో సాగు చేసిన మామిడితోటను దళారీ వ్యాపారులకు ఏడాదికి రూ.13.14లక్షలకు లీజుకు ఇచ్చి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మొదట్లో ప్రయోగాత్మకంగా ఎకరం తోట సాగుచేసి సత్ఫలితాలు సాధించిన తరువాతనే అధిక విస్తీర్ణంలో తోటల సాగుచేస్తున్నారు. ముంబై నుంచి ఫ్రూట్మార్కెట్ వ్యాపారులు కొల్లాపూర్ ప్రాంతంలో మకాం వేస్తున్నారు. పెద్దకొత్తపల్లి, సాతాపూర్, చెన్నపురావుపల్లి, కొత్తపేట, కల్వకోలు, తదితర గ్రామాల శివారులో మామిడి తోటలకు నేరుగా వెళ్లి కాయలను టన్ను రూ.65వేలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన కాయలను పెద్దకొత్తపల్లిలో ఎంఎస్ ట్రెడర్స్ పేరుతో గోడౌన్ను ఏర్పాటు చేసి అందులోకి తరలిస్తున్నారు. అక్కడ కూలీలతో ఏ గ్రేడ్, బీగ్రేడ్ చొప్పున పెట్టెల్లో నిల్వచేస్తారు. 2018లో టన్ను ధర రూ.1.30లక్షలు ఉండగా ఈఏడాది దిగుబడి తగ్గడంతోపాటు ధర కూడా పూర్తిగా పడిపోయింది. దీంతో రైతులు దళారులకే విక్రయిస్తున్నారు.
రైతులకు రవాణా, తరుగు, కూలీల ఖర్చులు మిగిలిపోతున్నాయి. కొందరు రైతులు 15రోజులుగా ప్రతి రోజు 20,30 బొలేరో వాహనాల్లో హైదరాబాద్ మార్కెట్కు మామిడి ఎగుమతి చేస్తున్నప్పటికీ ఖర్చులు తడిసి మోపెడవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. కల్వకోల్ శివారులో మామిడి తోటలకు సెర్ప్ బృందం వెళ్లి కాయలను సేకరించి బాక్సుల్లో కాయలను అమర్చి బెంగళూరుకు లారీల్లో ఎగుమతులు చేస్తున్నారు. సెర్ప్ ఏపీడీ శ్రీనివాస్, డీపీఎం సుధాకర్, ఏపీఎం అరుణ, సీసీలు ఇందిర, వసంత్, శేషన్న, మాన్యనాయక్ బృందం మామిడి కొనుగోలును రైతుల నుంచి చేపట్టారు. అయితే సెర్ప్కు దీటుగా ముంబై ప్రూట్ మార్కెట్ దళారీల బెడదతో రైతులు అయోమయంతో గందరగోళానికి గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి
అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!
ఎస్యూవీలకు ఫుల్ క్రేజీ.. ధరలు కూడా ఎక్కువే..