Morocco : మొరాకో నుంచి స్పెయిన్లోకి అక్రమంగా చొరబడ్డ వలసదారులు గంటల వ్యవధిలోనే సొంత దేశానికి తిరుగుముఖం పట్టారు. గురువారం స్పెయిన్లోకి అడుగుపెట్టిన 60,000 మందిలో దాదాపు 45,000 మందికిపైగా శుక్రవారం మొరాకో వెళ్లిపోయినట్లు అంచనా. మొరాకో నుంచి సముద్ర మార్గం ద్వారా స్పెయిన్ ఆధీనంలో ఉన్న సెయూటాకు గురువారం ఒక్కసారిగా వేలాది మంది వలసదారులు పోటెత్తారు. చిన్న చిన్న పడవల్లో, ఈదుకుంటూ స్పెయిన్ చేరుకున్నారు. దాదాపు 60,000 మందికిపైగా ఒక్కరోజే అక్రమంగా వచ్చి ఉంటారని అంచనా. సముద్ర తీరం నుంచి, సరిహద్దు భాగం నుంచి పర్వత ప్రాంతమైన సరిహద్దులోకి వేలాదిమంది వస్తున్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
సముద్రంలో ఈదుకుంటూ వస్తుండగా 57 మంది మొరాకో వాసులు మరణించి ఉంటారని అంచనా. అయితే, తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్ని స్పెయిన్ అడ్డుకుంది. సరిహద్దులో స్పెయిన్ భద్రతా బలగాలు వీరిని అడ్డుకున్నాయి. వలసదారులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్తోపాటు కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కాగా.. కొందరు తొక్కిసలాట కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు అడ్డుకోవడంతో వేలాదిమంది వలసదారులు తిరిగి మొరాకో వెళ్లిపోయారు. ఈ క్రమంలో చాలా మంది సముద్రంలో మునిగి చనిపోయినట్లు తెలుస్తోంది. సెయుటా నగరం ఎంట్రన్స్ వద్దే వీరిలో చాలా మందిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. సరిహద్దులో భారీగా సైనిక వాహనాల్ని కూడా స్పెయిన్ ప్రభుత్వం మోహరించింది. వలసదారుల్ని అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. సరిహద్దుకు కొద్ది దూరం నుంచి ఆ ప్రాంతాల్ని పర్యవేక్షిస్తోంది. భద్రతా బలగాల్ని తప్పించుకుని కొందరు వలసదారులు దేశం లోపలికి ప్రవేశించారు.
అయితే, వారికి అక్కడ ఆశ్రయం, ఆహారం, నీరు కూడా లభించలేదు. తాను ఐదు గంటలు ఈదుకుంటూ స్పెయిన్ వచ్చానని, కానీ, తనపై అక్కడి సైన్యం దారుణంగా దాడి చేసిందని ఒక వలసదారుడు తెలిపాడు. కొందరు గురువారం రాత్రంతా వీధుల్లోనే ఉన్నారు. అక్కడి సైన్యం, భద్రతా దళాల్ని చూసి భయపడిపోయారు. దీంతో వచ్చినవాళ్లు వచ్చినట్లే గంటల వ్యవధిలోనే తిరిగి మొరాకోకు వెళ్లిపోయారు. 60,000 మందిలో దాదాపు 45,000 మంది వలసదారులు శుక్రవారం తిరిగి వెళ్లిపోయారు. ఈ వలసదారులు.. సెయూటా నగర జనాభాలో 70 శాతం వరకు ఉన్నారు. ఈ స్థాయిలో వలసదారులు రావడంతో స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది యువకులు వీధుల్లో హంగామా చేస్తూ కనిపించారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రభుత్వం వీరిని అడ్డుకుని తిరిగి వారి దేశానికి పంపిస్తోంది.