సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తోందన్నారు.
గురువారం న్యూబోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో న్యూ బోయిన్పల్లి చిన్నతోకట్ట సంజీవయ్యనగర్ కాలనీకి చెందిన ఎం. బాబూరావు అనే వ్యక్తి వైద్యం కోసం రూ.60వేల విలువ చేసే చెక్కుని వారి కుటుంబసభ్యులకు జక్కుల మహేశ్వర్రెడ్డి అందజేసి మాట్లాడారు.
గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాబూరావు నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఖర్చుల నిమిత్తం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిని సంప్రదించగా, స్పందించిన జక్కుల సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించారు.
అనంతరం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.60వేల విలువ గల చెక్కుని లబ్ధిదారు కుటుంబసభ్యులకు జక్కుల అందజేశారు. ఈ సందర్భంగా జక్కుల మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుపేదల వైద్యానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు.
పనుల ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని, ఈ పథకంతో పేదలకు కార్పొరేట్ దవాఖానల్లో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో నర్సింహ్మారావు, రాజ్కుమార్, ఎనముల విజయ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.