తిరుమల : సెప్టెంబర్ 15 నుంచి 23 వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ( Srivari Brahmotsavams ) నిర్వహించనున్న నేపథ్యంలో 9 రోజుల పాటు ఆర్జిత సేవ ( Arjitha Seva Cancell ) ను టీటీడీ రద్దు చేసింది. అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు వివరించారు.
వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేశామని వెల్లడించారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం 78,561 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 33,361 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలిగిందని టీటీడీ అధికారులు వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.31 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.