ఇబ్రహీంపట్నం : వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పౌల్ట్రీ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ. 2 చొప్పున సబ్సిడీ ఇస్తూ ప్రకటించడంతో పౌల్ట్రీ, పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ మీటర్ల ద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులు వస్తుండటంతో దీనిని గమనించిన ప్రభుత్వం రైతులకు బిల్లుల భారం తగ్గించాలనే ఉద్దేశంతో సబ్సిడీ అందజేస్తుంది.
పాడి, లేయర్, బాయిలర్ ఫారాలతో పాటు పౌల్ట్రీ అనుబంధ రంగాలైన హేచరీస్, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. దీంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గనుందని ఈ విషయమై గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పౌల్ట్రీ, పాడి రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇంత మంచి నిర్ణయం తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్న రైతులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాన్ని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంజిరెడ్డి, పౌల్ట్రీ రైతు
పౌల్ట్రీ రంగానికి సబ్సిడీ విద్యుత్ అందజేయడం మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఆచరణలో కూడా తీసుకురాలేదు. కరోనాతో నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్న పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం సబ్సిడీ అందజేయడం సంతోషకరం.
రైతుల కష్టాలు తీర్చే ప్రభుత్వం
చిలుకల బుగ్గరాములు, పాడి, పౌల్ట్రీ రైతు
అన్ని వర్గాల సంక్షేమంతో పాటు రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీఠ వేస్తున్న టీఆర్ ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పౌల్ట్రీ, పాడి పరిశ్రమలకు సబ్సిడీ విద్యుత్ అందజేస్తామని ప్రకటించడం సంతోషకరం. విద్యుత్ బిల్లులు నెలనెల మోపెడవుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీతో కాస్తైనా భారం తగ్గుతుంది.