సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని ప్రతి వార్డులో నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా మంచినీటి విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే నిధుల నుంచి మూడో వార్డుతో పాటు ఆరో వార్డులోని సీతారాంపురం, తిరుమల ఎన్క్లేవ్లలో నూతన బోర్వెల్ పనులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ ఇప్పటికే పలు వార్డుల్లో నూతన బోర్వెల్లు వేయించడం జరిగిందని, నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. దీంతో పాటు తాగునీటి విషయంలో కూడా జీహెచ్ఎంసీ మాదిరిగానే కంటోన్మెంట్లో సైతం త్వరలోనే ఇంటింటికీ 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేయబోతున్నామని వెల్లడించారు.
కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, నేతలు నివేదిత, ముప్పుడి గోపాల్, మధుకర్, మురళీయాదవ్, సదానంద్గౌడ్, పనస సంతోష్ తదితరులు పాల్గొన్నారు.