మన్సూరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన అంగల్ల శ్రీను (49) తన భార్య అన్నపూర్ణతో కలిసి జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి ఎల్బీనగర్, సాగర్ రింగ్రోడ్డు సమీపంలో ఉంటున్నాడు.
శ్రీను వృత్తిరీత్య కూలీ పని చేస్తుంటాడు. ఈనెల 3న సాయంత్రం 7 గంటల సమయంలో పని నిమిత్తం తన టీవీఎస్ బైకు (టీఆర్04 పీఆర్002)పై ఉప్పల్కు వెళ్లాడు. ఉప్పల్ నుంచి సాగర్ రింగ్రోడ్డుకు వస్తుండగా నాగోల్ బ్రిడ్జి సమీపంలో అతివేగంగా వచ్చిన డీసీఎం (ఏపీ28 టీఈ7996) శ్రీను బైకును ఢీకొట్టింది.
ఈ ఘటనలో శ్రీను తీవ్రంగా గాయపడగా హస్తినాపురంలోని మమతా హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. నాటి నుంచి దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీను బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.