సత్తుపల్లి/ సత్తుపల్లి రూరల్, మే 30: కరోనా కాలంలో పనులు దొరకక అవస్థలు పడుతున్న రిక్షా కార్మికుల దీనావస్థను చూసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చలించిపోయారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సంకల్పించారు. పట్టణంలోని రిక్షా కార్మికులందరికీ బియ్యం, నిత్యావసర సరుకులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్లో ప్రజలు బయటకు రాకపోవడం, పనులు లేకపోవడం వంటి కారణాలతో రిక్షా కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికుల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆర్టీసీ డీఎం శ్రీహర్ష, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య పాల్గొన్నారు.
దాతల సహకారం మరువలేనిది: సండ్ర
కరోనా బాధితులకు ప్రాణవాయువు అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇచ్చిన పిలుపుమేరకు అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ బెల్లం మధు (చిరాగ్ ఫౌండేషన్) స్పందించారు. రూ.1.10 లక్షల విలువైన ఐదు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఎమ్మెల్యే సండ్ర ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వసుమతిదేవికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు ఇబ్బందులు పడకూడదని ప్రాణవాయువును అందించేందుకు ఎన్ఆర్ఐలు ముందుకురావడం శుభపరిణామమన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వీరపనేని రాధికా బాబీ దంపతులు, దొడ్డా శంకర్రావు, అద్దంకి అనీల్ సహకారంతో ఫ్లో మీటర్లను అందించారని, మధిర ప్రభుత్వ ఆసుపత్రికి సైతం ఇక్కడి దాతల సహకారంతో ఫ్లో మీటర్లు అందించినట్లు చెప్పారు.