అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
మాజీ ప్రధాన మంత్రి పీవీకి అత్యంత సన్నిహితుడు
ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి..
ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్గా సేవలు
గురుదక్షిణ ఫౌండేషన్ ఏర్పాటు..
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక
సీఎం కేసీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి, ఎంపీ, ప్రజాప్రతినిధుల సంతాపం
ఖమ్మం, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీనియర్ రాజకీయవేత్త, రాజకీయ దురంధరుడు, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు చేకూరి కాశయ్య(87) సోమవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
కాశయ్యది మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు. ఆయనకు నలుగురు సంతానం. ఆయన భార్య గతంలోనే మృతిచెందారు. కాశయ్య కొత్తగూడెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. ఈ క్రమంలో జిల్లా రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న చేకూరి ఏ పార్టీలో ఉన్నా అందరితో సన్నిహితంగా ఉండేవారు. హిందీ ప్రచారసభ అధ్యక్షుడిగా పలుమార్లు పనిచేశారు. ఆయనకు జాతీయ స్థాయిలోనూ విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రెండుసార్లు అదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా కాంగ్రెస్, జనతా పార్టీల నుంచి గెలుపొందారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1987లో జిల్లా పరిషత్కు నిర్వహించిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి మాజీ మంత్రి జలగం ప్రసాదరావుపై గెలుపొందారు.
రాజకీయ దురంధరుడిగా.. విశ్లేషకుడిగా.. ట్రబుల్షూటర్గా పేరుంది. తొలుత కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ప్రజాసమితి, జనతా, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరారు.
మాజీ ప్రధాని పీవీకి అత్యంత సన్నిహితుడు
కాశయ్య మాజీ ప్రధానమంత్రి పీవీ.నర్సింహారావుకు అత్యంత సన్నిహితుడిగా.. అంతరంగికుడిగా వ్యవహరించారు. కాశయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ప్రధానమంత్రిగా పీవీ.నర్సింహారావు సంస్కరణలకు ఆకర్షితులై ఆయనకు మద్దతు పలికారు. దీంతో 1993లో ఆయన్ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పీవీ సాన్నిహిత్యంతో 1994లో కాంగ్రెస్లో చేరి అప్పటి సుజాత్నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
రాజకీయ చతురత.. సమస్యలపై అవగాహన
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మాజీ మంత్రులు శీలం సిద్ధారెడ్డిలకు సమకాలీకులు.. రాజకీయ చతురతోపాటు సమస్యల పట్ల అవగాహన కలిగిన నేత. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృత పరిచయాలున్నాయి. ప్రతి గ్రామంలో కనీసం 20 మందిని పేరుపెట్టి పిలిచేవారు. శాసనసభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోనేరు నాగేశ్వరరావుతో సన్నిహితంగా ఉండేవారు.
గురుదక్షిణ ఫౌండేషన్ ఏర్పాటు
ఆయన ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేశారు. మిత్రులతో కలిసి ఖమ్మంలో గురుదక్షిణ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం, సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానం, అనుచరగణం ఉంది.