బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా నిర్మల్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి స్థానం
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడి
నిర్మల్ అర్బన్, జూన్ 22 : బహిరంగ మలమూత్ర విసర్జన రహిత మున్సిపాలిటీల్లో నిర్మల్ నిలిచినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా వెల్లడించిన జాబితాలో నిర్మల్ పట్టణం చోటు సంపాదించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 12 మున్సిపాలిటీల్లో నిర్మల్కు మొదటి స్థానం దక్కినట్లు మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తెలిపారు.
నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులున్నాయి. మొత్తం 1,35,484 మంది ఉండగా.. 18 సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. సామూహిక మరుగుదొడ్లలో శుభ్రతను పాటించడంతో కేంద్రం ఓడీఎఫ్ ప్లస్.. ప్లస్గా గుర్తింపునిచ్చింది. పట్టణ ప్రజలకు ఎప్పటికప్పుడు బహిరంగ మలమూత్ర విసర్జనతో కలిగే అనర్థాలను అధికారులు, నాయకులు వివరించారు. ప్రజలను మరుగుదొడ్లు నిర్మించుకునే లా అవగాహన కల్పించారు. పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించడంతో ప్రజలు బహిర్భూమికి స్వస్తి పలికారు. సామూహిక మరుగుదొడ్ల వద్ద శుభ్రత, స్వచ్ఛత పాటించడం, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడడంతో కేంద్రం నిర్మల్ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత మున్సిపాలిటీగా ధ్రువీకరించింది.
అందరి సహకారంతోనే మొదటి ర్యాంకు..
నిర్మల్ పట్టణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్న మంత్రి సూచనల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో నిర్మల్కు మొదటిస్థానంలో నిలిచింది. ఇందులో అందరి కృషి ఉంది. ఓడీఎఫ్లోనే కాకుండా రానున్న రోజుల్లో అన్ని విభాగాల్లో మొదటిస్థానంలో ఉండేందుకు కృషి చేస్తాం.