ఖమ్మం, మే 14: కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మూడో రోజు శుక్రవారమూ విజయవంతంగా కొనసాగింది. ఖమ్మం నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఉదయం 10 గంటల వరకు మాత్రం నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం బైపాస్ రోడ్డు, మరికొన్ని ప్రాంతాల్లో మినహా నగరమంతా పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఖమ్మం నగరంలో అనేక ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా రక్త పరీక్షలు నిర్వహించే ల్యాబ్ల వద్ద ప్రజలు వివిధ పరీక్షల నిమిత్తం వచ్చి బారులు తీరుతున్నారు. అదేవిధంగా మెడికల్ దుకాణాలు నిత్యం రద్దీగా కనిపిస్తున్నాయి. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డు, జడ్పీ సెంటర్, మయూరిసెంటర్, ఎన్ఎస్టీ రోడ్డుల్లో గల పలు ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో రోగులతో రద్దీ ఏర్పడుతోంది.
నిర్మానుష్యంగా రహదారులు
ఖమ్మం నగరంలోని పలు రహదారులు శుక్రవారం నిర్మానుష్యంగా మారాయి. ముఖ్యంగా వాణిజ్య కేంద్రాలు ఉదయం 10 గంటల వరకు రద్దీగా కనిపిస్తున్నాయి. ఆ తరువాత నిర్మానుష్యంగా ఉంటున్నాయి. గాంధీచౌక్, పీఆర్ఎస్ రోడ్, కాల్వొడ్డు, వైరా రోడ్డు, కమాన్బజార్, ఇల్లెందు క్రాస్ రోడ్డు , కస్బాబజార్ తదితర ప్రాంతాల్లోని వస్త్ర దుకాణాలు, కిరాణా షాపులు, పలు రకాల హోల్ షాపులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంటున్నాయి. ప్రస్తుతం వివిధ శుభ కార్యాలయాలు ఉన్నందున ఆయా ప్రజలు షాపులు తెరిచి ఉంచే సమయంలో వచ్చి వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేనస్తున్నారు. దీంతో ఆ నాలుగు గంటలపాటు వాణిజ్య కేంద్రాలు రద్దీగా కనిపిస్తున్నాయి.