మొయినాబాద్, ఏప్రిల్21: చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ ఓ డబ్బాలోని వ్యర్థాలు పారబోస్తుండగా పేలి తీవ్రంగా గాయపడిన ఘటన మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో జరిగింది. ఇన్స్పెక్టర్ రాజు కథనం ప్రకారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన నాగుల రాంచందర్,లక్ష్మి దంపతులు అజీజ్నగర్లో నివాసం ఉంటూ చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలు సేకరించుకుంటూ జీవిస్తున్నారు. బుధవారం లక్ష్మి అజీజ్నగర్ రెవెన్యూ పరిధిలోని చిత్ర మందిర్ ఎదుట ఉన్న మంచి నీటి పైపులైన్ పక్కన లక్ష్మి ప్లాస్టిక్ డబ్బాను తీసుకుని అందులో ఉన్న తెల్లని గుళికలను డబ్బా నుంచి చెత్తను పారబోస్తుండగా అకస్మాత్తుగా పేలాయి. దీంతో ఆమె కుడి అరచేతి పూర్తిగా ఎముకలు కనిపించేలా , తలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో ఆమెతో ఉన్న బంధువు సుజాత వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇవ్వడంతో లక్ష్మిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ జగదీశ్వర్ దవాఖానకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం, బాంబు స్కాడ్తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశామని, ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. క్లూస్ టీం, బాంబు స్కాడ్, డాగ్ స్కాడ్ పేలుడుకు సంబంధించిన పదార్థాలను గుర్తించారు. తెల్లటి గుళికలుగా మారిన పదార్థాలు రంగుల్లో(పెయింటింగ్) వాడే హైడ్రో పెరాక్సైడ్ రసాయన పదార్థంగా గుర్తించారు. దానికి పేలే స్వభావం ఉంటుందన్నారు. గుళికలను పారబోస్తుండగా రాపిడి జరిగి పేలిందని బాంబుస్కాడ్ బృందం వెల్లడించింది. పేలుడు పదార్థం ప్రభుత్వ భూమిలో ఎవరు వేశారు, ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.