1,579 ఎకరాల్లో వరి, 134 ఎకరాల్లో కూరగాయలు, పండ్లతోటలకు నష్టం
పిడుగుపాటుకు మూగజీవాల మృత్యువాత
పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
భూదాన్ పోచంపల్లి మండలంలో అత్యధికంగా 25.2మి.మీ. వర్షపాతం నమోదు
క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేసిన వ్యవసాయ, ఉద్యానవన అధికారులు
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. పది మండలాల్లో గాలిదుమారంతో కూడిన వర్షం పడగా.. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది. ఫలితంగా వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనాలు రూపొందించారు. 1,579 ఎకరాల్లో వరి పంట, 134 ఎకరాల్లో కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నట్లు నివేదిక రూపొందించారు. పిడుగుపాటుకు పలు ప్రాంతాల్లో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. చేతికందే దశలో పంటలు వర్షార్పణం కావడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెగిపోయిన విద్యుత్ వైర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్ల కారణంగా చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జిల్లాలో సరాసరి వర్షపాతం 8.5మి.మీ.గా కాగా.. భూదాన్ పోచంపల్లి మండలంలో అత్యధికంగా 25.2మి.మీ. వర్షపాతం నమోదైంది.
జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, పిడుగుపాటు, వడగండ్లతో కూడిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. పలు మండలాల్లో వరి చేను నేలకొరిగింది. కల్లాల వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసింది. పిడుగుపాటుకు యాదగిరిగుట్ట మండలం గుండ్లపల్లిలో రెండు పాడి గేదెలు, ఆత్మకూరు మండలం కొరటికల్లో ఎద్దు, రాజాపేట మండలం రఘునాథపురంలో ఆవు మృతి చెందాయి. చౌటుప్పల్ మం డలంలో ఇండ్ల పైకప్పులు గాలికి లేచిపోగా.. పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆత్మకూరు మండలం ఉప్పలపాడులో ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రామన్నపేట మండలం ఇంద్రపాలనగర్లో పిడుగు పడ్డప్పటికీ ఎటువంటి నష్టం జరగలేదు. చౌటుప్పల్ మండలంలో దెబ్బతిన్న పంటలను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
1,713 ఎకరాల్లో వరి, పండ్ల తోటలకు నష్టం..
జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు 20 గ్రామాల పరిధిలో 1,579 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు తయారు చేశారు. చౌటుప్పల్ మండలంలో 1,006 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. వలిగొండ మండలంలో 258 ఎకరాల్లో, బీబీనగర్ మండలంలో 130 ఎకరాల్లో, సంస్థాన్ నారాయణపురం మండలంలో 130 ఎకరాల్లో, రాజాపేట మండలంలో 55 ఎకరాల్లో కలిపి మొత్తం 1,579 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఈనెల 14, 20, 22 తేదీల్లో కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా 34 గ్రామాల పరిధిలో మొత్తం 5,127 ఎకరాల్లో వరి పంటలకు నష్టం కలిగినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. అలాగే భువనగిరి, తుర్కపల్లి, నారాయణపురం, చౌటుప్పల్, బీబీనగర్ మండలాల్లో పండ్ల తోటలకు నష్టం జరిగింది. కూరగాయల తో టలు దెబ్బతినగా.. మామిడి, బొప్పాయికాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 5 ఎకరాల్లో కూరగాయల తోటలు, 125 ఎకరాల్లో మామిడితోటలు, 4 ఎకరాల్లో బొప్పాయి తోటలు కలిపి 63 మంది రైతులకు చెందిన 134 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యానవన అధికారులు నివేదిక రూపొందించారు.
జిల్లాలో 8.5 మి.మీం సరాసరి వర్షపాతం నమోదు
721.6మి.మీ సాధారణ వర్షపాతానికి గాను 1,074.6 మి.మీ వర్షం కురియడంతో జిల్లాలో సరాసరి వర్షపాతం 8.5బి.మీగా నమోదైంది. పది మండలాల్లో వర్షం పడగా.. అత్యధికంగా భూదాన్పోచంపల్లి మండలంలో 25.2మి.మీ వర్షపాతం కురిసింది.
పంటలను ముంచిన వాన
మోత్కూరు, ఏప్రిల్ 23 : మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సా యంత్రం ఉరుములు, మెరుపులు, గాలివానతో కురిసిన వర్షంతో వరి పం ట తడిసిపోయింది. వ్యవసాయ మార్కెట్, ఐకేపీ, రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. కల్లాల్లో పోసుకున్న వరి పంటలు పూర్తిగా తడిసి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మోత్కూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, జామచెట్లబావి, కొండగడప, పాటిమట్ల, పొడిచేడు, ముశిపట్ల, బుజిలాపురం గ్రామాల్లో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
చెట్టంత దేవుడికి చెట్టు తొర్రే ఆలయం.. మన తెలంగాణలోనే
ఆ చిన్నారిని కాపాడిన రైల్వే హీరోకు గిఫ్ట్గా ఖరీదైన బైక్