చిక్కడపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయకపోతే రాష్ర్టాన్ని స్తంభింపజేస్తామని రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హామీల అమలు కోసం ఈనెల 24 నుంచి ఆటో డ్రైవర్ల నిరవధిక సమ్మె(బంద్) నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆటో, యాస్, ఆధారిత డ్రైవర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆటో, క్యాబ్, వ్యాన్, డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహించారు.

వి.మారయ్య(బీఆర్టీయూ), సత్తిరెడ్డి, గాజుల ముఖేష్ గౌడ్, పి.శ్రీకాంత్, విశంకర్(బీఎంఎస్), వి.ప్రవీణ్(టీయూసీఐ) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరవధిక సమ్మె(బంద్)కు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ, కార్పొరేట్ సంస్థలకు ఈవీ ఆటోలు అందించే ప్రతిపాదననను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని, నగరంలో సుమారు 2.5 లక్షల మంది ఉన్నట్లు చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరుకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు వి. మల్లేష్ గౌడ్, యాదగిరి దయానంద్, కొమరయ్య పాల్గొన్నారు.