పూర్వం తిరుపతికి బయల్దేరిన కొందరు మునులు మార్గమధ్యలో అటవీ ప్రాంతంలో సేదతీరారు. అప్పటికే తీవ్రంగా అలసిపోవడంతో నువ్వే మాకు దర్శనం ప్రసాదించాలి స్వామీ అని వేడుకుంటూ రాత్రి అక్కడే నిద్రించారు. అప్పుడు శ్రీనివాసుడు వారి కలలో కనిపించి.. ప్రాణహిత నది ఒడ్డున ఉన్నన చెట్టులో వెలుస్తానని చెప్పాడు. ఉదయం లేచి చూసిన ఆ మునులకు చెట్టు తొర్రలో స్వామివారి ప్రతిమలు కనిపించాయి. దీంతో తిరుపతి ప్రయాణాన్ని నిలిపివేసుకుని.. ఇక్కడే వేంకటేశ్వరునికి పూజలు చేయడం ప్రారంభించారని ఐతిహ్యం. ఇప్పటికీ రోజూ చీకటిపడగానే.. కొందరు రుషులు ఈ ప్రాంతాన్ని సందర్శించి, స్వామివారికి నిత్యపూజలు చేస్తుంటారని ప్రతీతి. అందుకే, సాయంత్రం ఐదు గంటల తర్వాత భక్తులు ఉండేందుకు అనుమతించరు. వేంకకటేశ్వరుడు స్వయంభువుగా వెలియడంతోపాటు ఏడు గుండాలు (తోగు) ప్రవహించడం వల్లే తోగు వెంకటాపూర్గా ఈ పల్లెకు పేరు వచ్చినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు.
250 సంవత్సరాల క్రితం ప్రాణహిత నది పోటెత్తడంతో భారీగా వరదలొచ్చాయి. పంటలు అన్నీ నీట మునిగాయి. పల్లెలు కొట్టుకుపోయాయి. అపార జన నష్టం సంభవించింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రజలు.. ఆ గండం నుంచి తమను రక్షించమని ఆ పరిసర ప్రాంత ప్రజలు శ్రీహరిని వేడుకున్నారు. ఆయన మొర ఆలకించడంతో వరదలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వేంకటేశ్వరస్వామి, అలమేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ప్రతిమలు ప్రవాహంలో కొట్టుకొచ్చాయి. మహారాష్ట్రలోని సిరొంచా తాలూకాలో ఉన్న వెంకటాపూర్ సమీపంలోని మద్దిపాలచెట్టు తొర్రలో అవి ఆగిపోయాయి. అటుగా వెళ్తున్న ఓ భక్తుడికి ఆ ప్రతిమలు కనిపించాయి. దీంతో ఊరివారికి సమాచారం ఇచ్చాడు. గ్రామస్థులు తరలివచ్చి, స్వామికి నిత్య పూజలు చేయడంతో ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతమైంది.
అలుమేలు మంగ, పద్మావతి, వేంకటేశ్వరస్వామి విగ్రహాలతో పాటూ వినాయకుడి ప్రతిమ, నాగేంద్రుడి పడగ కూడా ప్రవాహంలో కొట్టుకొచ్చాయి. ఆలయానికి దగ్గరలోని అటవీ ప్రాంతంలో ఏడుగుండాల పేరుతో పవిత్ర తీర్థాలు ఉన్నాయి. వీటిలో ఒక గుండం వరకూ వెళ్లవచ్చు. ఇక్కడే భక్తులు స్నానమాచరిస్తారు. ఈ గుండానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఎదురుగా నిలబడి చప్పట్లు కొడితే నీటి ప్రవాహం పెరుగుతుందని అంటుంటారు. మిగతా గుండాలు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా భక్తుల ధూప, దీప నైవేద్యాలు అందుకుంటున్నాడు. నిత్యం జాతరను తలపించే స్వామివారి సన్నిధికి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్, చత్తీస్గఢ్ నుంచీ వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తుల రద్దీ పెరగడం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఓ అతిథి గృహాన్ని కూడా నిర్మించింది.
తోగు వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని, కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. తిరుమలకు తోగు వెంకటాపూర్కు చాలా పోలికలు ఉన్నాయి. అక్కడ శ్రీనివాసుడు పుట్టలో కనిపించాడు. ఇక్కడేమో చెట్టు తొర్రలో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఉన్నట్టే, పూర్వం తిరుమలలోనూ ఓ పెద్ద చెట్టు ఉండేదట. దాని ప్రస్తావన అన్నమాచార్యుల కీర్తనల్లోనూ కనిపిస్తుంది. తిరుమలగిరులు ఔషధ మొక్కలకు నెలవైనట్టే.. ఈ ప్రాంతమూ అటవీ సంపదకు నిలయం. ఆపదమొక్కుల వాడికి తలనీలాలు సమర్పించే సంప్రదాయమూ ఉన్నది.
తోగు వెంకటపూర్కు చేరుకోవాలంటే మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని ప్రాణహిత నదిని దాటి వెళ్లాలి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి మంచిర్యాల దాకా రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. మంచిర్యాల నుంచి వేమనపల్లి మండలం కల్లంపల్లి గ్రామం మీదుగా, కొమురం భీం జిల్లాలోని దహెగాం మండలం రావులపల్లి వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి తోగు వెంకటపూర్ మూడు కిలో మీటర్ల దూరం. కొందరు రావులపల్లి గ్రామం వద్దే వాహనాలు నిలిపి, కాలినడకన ప్రాణహిత నదిని దాటి వెళ్తుంటారు. చెన్నూర్ నుంచి కూడా తోగు వెంకటాపూర్ వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మార్గం గుండా వెళ్లాలంటే ఒక్క వేసవికాలంలోనే సాధ్యమవుతుంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది దాటి, సిరొంచ మీదుగా కూడా చేరుకోవచ్చు.