‘నీకెవరు ఆదర్శం?’ ఈ ప్రశ్న తరచూ స్నేహితుల నుంచి ఎదురవుతూ ఉంటుంది. జవాబుగా తల్లిదండ్రులు, గురువు, ఇష్టదైవం పేరు చెబుతారని ఊహిస్తారు. స్నేహితుల ఊహ నిజమని భావించడంలో తప్పేమీ లేదు. జీవితంలో తల్లిదండ్రులు, గురువు, దేవుని కన్నా ఆదర్శం మరెవరుంటారు? అందుకే ‘మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషోవేద’ అని చెబుతుంది శతపథ బ్రాహ్మణం. తల్లిదండ్రులు, గురువు సముచిత రీతిలో జ్ఞాన, విజ్ఞానాలు అందించినప్పుడే మనుష్య నిర్మాణం చక్కగా జరుగుతుందని ఆ మాటలకు అర్థం.
గాయత్రీ మంత్రంలోని ‘భర్గో దేవస్య ధీమహి’ అనే వాక్యాన్ని గమనిస్తే భగవంతుని స్వరూపం వెల్లడవుతుంది. నిర్గుణుడు, నిర్వికారుడు, దోషరహితుడైన భగవంతుడే భర్గుడు. అతడు ధారణశక్తి కలిగిన మా బుద్ధిని ప్రేరేపించుగాక అని భావం. ఇక్కడ మనం దివ్య గుణాలు అనగా, సృష్టి రచనతో పాటు పోషించుట, రక్షించుట అనే సుగుణాలు కలిగిన దేవుణ్ని ఆదర్శంగా తీసుకుంటున్నామని గ్రహించాలి. ముఖ్యంగా భగవంతుడు సత్వం, రజస్సు, తమస్సు అనే ప్రకృతి గుణాలకు కట్టుబడనివాడు. అట్లే మనో వికారాలుగా భావించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు దూరంగా ఉన్నవాడు. రాగద్వేషాలకు అతీతుడు. అలాంటి భగవంతుడే మాకు ఆదర్శం కనుక ఆయనే మమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని అనుకోవడం మానవుడి కర్తవ్యం.
లోకంలో అందరూ ఆదర్శ పురుషులు కాకపోవచ్చు. కానీ, ఎవరు ఆదర్శ పురుషులో వారే మనకు ప్రమాణంగా నిలుస్తారు. ఒక్కసారి భగవద్గీతను అవలోకిస్తే.. లోకం శ్రేష్ఠ పురుషుడినే ఆదర్శంగా తీసుకుంటుందని, శ్రేష్ఠుడు దేన్ని ఆచరిస్తాడో దాన్నే ఆచరిస్తుందని, దేన్ని ప్రమాణంగా తీసుకుంటాడో దాన్నే ప్రమాణంగా తీసుకుంటుందని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రకటించాడు. మనకు జగద్గురువైన శ్రీకృష్ణుని కంటే ఆదర్శ పురుషుడు మరొకడు లేడు. ఆయన యోగీశ్వరుడు, సమ దర్శనుడు, ద్వంద్వాతీతుడు. లాభనష్టాలను, మానవమానాలను సమానంగా లెక్కించినవాడు. నిరంతరం ఆసక్తి రహితుడై కర్తవ్య కర్మలను ఆచరించినవాడు, నిష్కామ కర్మయోగి, మహాజ్ఞాని. ‘కర్మేంద్రియైః కర్మయోగమ్ ఆసక్తః స విశిష్యతే’ (భగవద్గీత 3-7). ఫలాపేక్షలేనివాడై, ఇంద్రియాలను జయించి, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించేవాడే శ్రేష్ఠుడని కృష్ణుడు చెప్పిన మాటలు గమనింపదగ్గవి.
శ్రీకృష్ణుడు ఎన్నడూ కర్మయోగం నుంచి వైదొలగలేదు. పాండవ పక్షపాతి అనే ముద్ర తలదాల్చినప్పటికీ ఆయన ఎప్పుడూ ధర్మపథం నుంచి తప్పుకోలేదు. యుద్ధం క్షత్రియ కర్మ కనుక, దాన్ని ధర్మంగా లెక్కించి యుద్ధం చేయమని అర్జునుడికి ఉపదేశించాడు. తనకు ముల్లోకాల్లో చేయదగిన కర్మలేవీ లేనప్పటికీ, పొందదగిన ఫలాలు కనిపించనప్పటికీ తాను మాత్రం కర్మ యందే ప్రవర్తిస్తున్నానని చెప్పడం కృష్ణ భగవానునికే సరిపడింది.
నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన
నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి (భగవద్గీత 3-22)
కృష్ణుని నోట ఒక విచిత్రమైన మాట వినిపిస్తుంది. ఫలాపేక్షతో అజ్ఞానులు ఏ విధంగా కర్మలాచరిస్తారో, ఫలాపేక్ష లేకుండా అదేవిధంగా విద్వాంసులు కూడా కర్మలు చేయాలని చెప్పడం గొప్ప విషయం. చెడు కర్మలపై చెడ్డవారికెంత మక్కువ ఉంటుందో, మంచి పనులపై మంచివారికీ అంతే శ్రద్ధ ఉండాలని ఇక్కడ మనం గ్రహించవలసి ఉన్నది. అయితే, అజ్ఞానుల బుద్ధిని సన్మార్గంలో నడిపించడానికి, జ్ఞాని స్వయంగా ఆచరించి చూపాలిగాని, వారిబుద్ధిని భ్రమింపజేయరాదని చెప్పిన విషయం పండితులకు శిరోధార్యం. ‘న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినామ్’ (భగవద్గీత 3-26) ధర్మంగా చేపట్టిన పని శ్రేష్ఠమైంది అయినా, కాకపోయినా తప్పక చేయవలసిందేనని, ఒకవేళ మరణం సంభవించినా స్వధర్మంలోనే నిలవడం శ్రేయస్కరం అని కృష్ణుడు చాటిచెప్పాడు. పురుషోత్తముడు, యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు నడిచిన, చూపిన మార్గంలో నడిచేవారు అదృష్టవంతులు. ఫలాపేక్ష లేకుండా వేద విహిత కర్మలు చేసేవారు జీవన్ముక్తులు.
ఆచార్య మసన చెన్నప్ప
98856 54381