Pothana Bhagavatam | కీర్తన భక్తి… అచ్యుత భగవానుని అనంత నామ వైభవాన్ని, అనుపమ రూప మాధుర్యాన్ని, అగణిత గుణ గౌరవాన్ని, అచింత్య లీలా లాలిత్యాన్ని, అశేష అవతార విశేషాలను విశదమైన యశో విభూతిని యథాశక్తి గానం చేయటం కీర్తనం. ‘కలౌ సంకీర్త్య కేశవం’, ‘కలౌ సంకీర్తనాన్ముక్తిః’- కలియుగంలో సంకీర్తనను మించిన సులభ తరణోపాయం లేదని సర్వశాస్ర్తాలూ ఘోషిస్తున్నాయి. నానాదోషాలకు నిధి అయిన కలిలో ఇదొక్కటే సుగుణం. ‘ప్రేమతో నా నామాలు పలుకుతూ, నా సన్నిధినే పెన్నిధిగా సేవించువానికి నిజంగా నేను అమ్ముడుపోతాను’ అని ఆదిపురాణంలో అనాది నిధనుడైన నారాయణుడు నరుడు-అర్జునుడితో అన్నమాట. మరో సందర్భంలో నీరజాక్షుడు నారదమునితో ‘నా భక్తులు అనురక్తితో, ఆర్తితో, నిష్ఠగా నన్ను ప్రస్తుతించే- కీర్తించే పవిత్ర ప్రదేశాలే నాకు ఇష్టమైన నివాస స్థలాలు. లచ్చి (లక్ష్మి)తో సహా వచ్చి అచ్చటనే నేను ముచ్చటగా తిష్ఠ వేసుకొని కూర్చుంటా. సదయమైన వైకుంఠం గాని, యోగుల హృదయాలు గాని నాకు అంతగా అభీష్టాలు కావు’ అని అంటాడు. తనను తాను తృణం (గడ్డిపరక) కన్నా తక్కువగా- తేలికగా తలుస్తూ, తరువు (చెట్టు) వంటి ఓర్పును సంతరించుకొని, రౌరవ నరకం లాంటి గౌరవాన్ని తాను ఆశించక, ఇతరులను మాత్రం యథాయోగ్యంగా (యోగ్యతను బట్టి) ఆదరిస్తూ, అభిమానిస్తూ ‘కీర్తనీయః సదా హరిః’- శ్రీహరిని సదా కీర్తించాలని చైతన్య మహాప్రభువుల అమృతోపదేశం.
‘మమ మాయా దురత్యయా’- ‘నా మాయ సామాన్యులకు- అభక్తులకు దాట శక్యం కానిది’ అని భగవద్వాణి. మానవులందరినీ తన హావభావ భంగిమలతో ఆకర్షించి మోహ పరవశులుగా చేసి ఆడించే ‘మాయా’ అనే ‘నర్తకీ’మణి, మాధవ ‘కీర్తన’ పరులముందు నిలువజాలక మాటపడిపోయి, చేష్టలుడిగి, మతిచెడి, తడబడి, తలక్రిందులై తోకముడుస్తుంది.
‘చింతనం’ అనగా స్మరణ భక్తి. సంతత ధ్యానం. ‘సర్వేషు కాలేషు మా మనుస్మర’- గీత. హృదంతరం- మనసులో, నిరంతరం చిరంతన (సనాతన) భగవానుని స్మరించుటే చింతన భక్తి. విష్ణుని విస్మరించుటే విపత్తి- ఆపద. సంస్మరించుటే సంపత్తి- సంపద. ‘సర్వ విధులకు పరాకాష్ఠ విష్ణు స్మరణం! సర్వ నిషేధాలకు అవధి హద్దు నారాయణ విస్మరణం!’ అని వేదవ్యాస వచనం. పది నామాపరాధాలకు పాలుపడకుండా నామం స్మరించాలి. నామ స్మరణంతో పాటు చాటుగానో, మాటుగానో సమాంతరంగా పాపాచరణం కూడా దీటుగానే కొనసాగుతూ ఉంటే, అది గజ (ఏనుగు) స్నానం వలె వ్యర్థమై చివరికి జీవితానికి చేటే వాటిల్లుతుంది. ఈ నవ విధ భక్తులు ముక్తికి సోపానాలు- మెట్లు. ఈ భక్తి నవకాన్ని భక్తిలోకానికి ప్రథమంగా ఇలా పరిచయం చేసింది బాల భక్త ప్రహ్లాదుడే! దంభ, దర్ప రహితంగా- భగవదర్పితంగా కావింపబడిన ‘నవధా భక్తి’యే ఉత్తమ అధ్యయనం. ఇదే హృద్యమైన విద్యాసారం- చదువులలో మర్మం. ‘యత్సార భూతం తదుపాసితవ్యం’- సర్వ వేద శాస్త్ర సారరూపుడైన ‘శౌరి’ని తెలిసి ఉపాసించుటే సూరి (పండిత) జన లక్షణం, స్వభావం. ‘విద్యాసార మెరుంగఁ గోరదె’ అన్న తండ్రి కోరికను మన్నిస్తూ తనయుడు సూటిగా, తేటగా చెప్పిన మేటి సమాధానం!
‘చదివి చదివి చదివి చావంగ నేటికి
చావులేని చదువు చదువ వలయు
చదివి చదివి కోటి జనులు చచ్చిరి కదా
విశ్వదాభిరామ వినురవేమ’
‘మృత్యువులేని జీవనము లోకాధీశ! యిప్పింపవే’- అని తపస్సులో విధాతను మెప్పించి వేడుకొన్నాడు విబుధ విరోధి హిరణ్యకశిపుడు. ‘తండ్రీ! బ్రహ్మదేవుని వరగర్వంతో మృత్యువును జయించానని భ్రమలో ఉన్నావు, చావులేని అసలు సిసలైన చదువు ఇదేన’ని సున్నితంగా, సౌమ్యంగా పితృపాదునికి సూచించాడు పుత్రరత్నమైన ప్రహ్లాదుడు.
మూలగ్రంథంలో లేని ‘తను హృద్భాషల’ (తిక్రరణ శుద్ధిగా) అన్న క్రియా విశేషణాన్ని పద్యారంభంలో అధికంగా, అందంగా అమర్చాడు అమాత్యుడు. ‘భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రమంచుఁ దలతున్’ అన్న భావం కూడా పోతనగారి ఇంపైన పెంపుదలే. మహాకవి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ ఉక్తి- మాట, పోతనకు భక్తిమయమైన ధార్మిక జీవనం పట్ల ఉన్న అనురక్తిని వేనోళ్ల వ్యక్తీకరిస్తుంది! నాటికి, నేటికి ముమ్మాటికి సజ్జనుడై మెలగుట భద్ర జీవితం, దుర్జనుడై బ్రతుకుట క్షుద్ర జీవితం.
సఖ్యభక్తికి అర్జునుడు, శ్రవణానికి పరీక్షిత్తు, దాస్యానికి దాసాంజనేయుడు, వందన భక్తికి అక్రూరుడు, అర్చనకు పృథు చక్రవర్తి- ఇతని అర్ధాంగికి అర్చి (అర్చన) అని పేరు, పాదసేవన భక్తికి లక్ష్మీదేవి, ఆత్మనివేదనకు బలి చక్రవర్తి, కీర్తనకు శుక, నారదాదులు, చింతన లేక స్మరణ (ధ్యాన) భక్తికి ప్రహ్లాదుడు మచ్చుకు ఉదాహరణలు. భాగవత ద్వితీయ స్కంధ ప్రారంభంలో శుకుడు పరీక్షిత్తుకు వర్ణించి చెప్పిన విష్ణుమూర్తి విరాట్-విశ్వరూప విగ్రహంలో ప్రహ్లాదుడు విరాట్పురుషునికి ‘స్మృతి’- (స్మృతీరసురానీక వీర్యః) స్మరణ శక్తిగా
వివరించబడినాడని గమనించదగ్గ విషయం.
శా॥‘అంధేందూదయముల్ మహాబధిర శంఖారవముల్ మూక స
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావలీ
బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్’
ప్రహ్లాదుడు ఇంకా ఇలా అన్నాడు..
‘కన్నులు లేని కబోదికి పున్నమి వెన్నెల వన్నెలు తెలియనట్లు, చెవిటి వానికి శంఖం ఊదినట్లు, మూగవాడు పుస్తకం పఠించినట్లు, నపుంసకుడు నాక (స్వర్గ)లోక కాంత మీద భ్రాంతిపడినట్లు, చేసిన మేలు మరిచి పైశాచికంగా ప్రవర్తించే చుట్టరికం వలె, బూడిదలో వ్రేల్చిన (అర్పించిన) హవ్యం- హోమ ద్రవ్యం లాగా; దానం, భోగం తెలియని దీనుని (లోభి) ధన ధాన్యాల వలె, పంకము (బురద)నే తప్ప పన్నీరు మెచ్చని పంది పగిది (వలె) హరిభక్తి లేని వారి సంసారాలు సారహీనాలు, వ్యర్థాలు, భూమికి భార రూపాలు.’ విష్ణువు నందు ఉల్లము (మనసు) చేర్చక ఇల్లను చీకటి నూతిలో పడి కొట్టుమిట్టాడుతున్న భక్తిహీనమైన బ్రతుకుల డొల్లతనాన్ని తేటతెల్లంగా బల్లగుద్ది వెల్లడించడానికి ఇన్నివిధాల ఉపమానాలు వాడితేనే మన పోతన మనసుకు తృప్తి!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
Pothana Bhagavatam | రట్టయిన చదువుల గుట్టు
Pothana Bhagavatam | విష్టరశ్రవునికి అష్టవిధ భావ పుష్పాలు
Pothana Bhagavatam |మందార మకరందాలు
Pothana Bhagavatam | విష్ణువు మనవాడైతే..విశ్వమంతా మనదే!