‘మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు?’, ‘సదా చిదానంద మూర్తియైన శ్రీహరి పదారవింద చింతనమనే సుధాపాన మత్తమైన నా చిత్తం కదాపి (ఎప్పటికీ) అన్యాయత్తం కావడానికి ఇతర అనాత్మ విషయం మీదికి మరలటానికి, మరో నిమిత్తం ఏదీ లేదు’ అని ప్రహ్లాదుడు ‘మ’ వర్ణ అక్షర, అనుప్రాస ఆవృత్తితో కర్ణ పర్వంగా, ఆనందార్ణవ మగ్నంగా, నిగర్వంగా, నిర్భయంగా, నిర్దుష్టం స్పష్టంగా ప్రకటించాడు.
నిజానికి రామభద్రుడు పలికించగా రససిద్ధుడైన పోతనామాత్యుడే ప్రహ్లాదుని నోట ఇలా పలికాడు! ఈ సీసం కరివరదుని ఉరు (గొప్ప) భక్తికి ‘హరి వాసం’ (వైకుంఠం) అనడంలో సంశయం లేశం కూడా లేదు. ‘నందనందనుని పదారవింద మరంద బిందువులు శాశ్వత సుఖ శాంతులకు సింధువులు. అవి సదా నా హృదయాన్ని ఆనందపరవశం చేయుగాక’ అని లీలాశుకు (బిల్వమంగళు)ని దీనాలాపన! మం॥ ‘మకరందం పిబన్ భృంగః గంధాన్నాపేక్షతే యథా, నాదాసక్తం సదా చిత్తం విషయం నహి కాంక్షతే’ (నాదబిందూపనిషత్) పుష్పంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ తుమ్మెద గంధాన్ని అపేక్షింప(కోర)నట్లు, ఎద సదా ప్రణవ నాదం (హరినామం)లో లీనమై బాహ్య విషయాలను కాంక్షించదు కోరదు. భౌతిక పుష్పార్చన కన్నా భావ కుసుమోపాసన ఎంతో మిన్న.
అహింస, ఇంద్రియనిగ్రహం, సర్వభూత దయ, క్షమ(సహనం), శాంతి, తపస్సు, ధ్యానం, చివరిది సత్యం ఇవే విష్టరశ్రవునికి విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన అష్టవిధ భావ పుష్పాలు. భగవంతుడు భావ భక్తిప్రియుడు. భౌతిక పూజకు, మంత్ర తంత్రాలకు భావమే చైతన్యం. భావహీనమైన పూజ నిష్ఫలం. మానస పూజకు ‘పరాపూజ’ అని కూడా పేరు. ‘మనః పుష్పం సమర్పయేత్’ మనస్సనే పుష్పాన్ని మాధవునికి అర్పించుటే మానస పూజకు పరాకాష్ఠ!
నారద మహర్షి యుధిష్ఠిరునితో… ధర్మజా! ప్రహ్లాదుని పలుకులకు ఆగ్రహించిన పురోహితుడు అతనిని తిరస్కరిస్తూ ఇలా అన్నాడు ప్రహ్లాదా! పంచ వత్సరాల పసివాడివి. వేలెడంత కూడా లేవు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న చందంగా అనవసరంగా ప్రేలుతున్నావు. అధికంగా వాదిస్తున్నావు, మమ్ములను బాధిస్తున్నావు. మేము బోధించిన శాస్ర్తాలలోని ఒక్క విషయం కూడా నువ్వు శోధించి చెప్పడం లేదు. మహారాజు ముందు మాకు తలవంపులు కలిగించావు. విరోధిని మెచ్చుకొంటూ నీ వంశానికి మాయని మచ్చ తెచ్చావు.
సోదరా! దానవపతికి వీడు పుత్రుడు కాడు, పగవాడు. దైత్యులనే మంచిగంధపు వృక్షాల వనంలో ముళ్లచెట్టు లాగా పుట్టాడు. వీడు ఇంటికి జెష్ఠ, పొరుగింటికి శ్రీమహాలక్ష్మి! అహర్నిశం అసురవైరి అయిన ఆ శ్రీహరినే వరిస్తూ, వర్ణిస్తూ ఉంటాడు. మొట్టికాయలకే గాని వీడు వట్టి మాటలకు వినడు. వీణ్ణి పట్టుకొని గట్టిగా నాలుగు పీకితేగాని పట్టిన దయ్యం వదిలిపెట్టదు’ అని ఆచార్యుడు అసురరాజుతో ఇంకా ఇలా అన్నాడు. ‘మహారాజా! మీ పాదాల మీద ఒట్టు. ఈ రాజపట్టిని రాచబిడ్డని, భయపెట్టయినా సరే దారిలోకి పట్టుకొస్తాం. మీరు మామీద మాత్రం ఆత్రపడి ఆగ్రహించకండి’. ‘పరశోర్విష్ణోర్నాలాయితోర్భకః’ మూలంలోని విష్ణువనే ‘పరశువుకు గొడ్డలికి, ఈ పసిపిల్లడు దండం చేతి పిడి, అయ్యాడు!’ అన్న గంభీరమైన భావం తెలుగులోకి రాలేదు.
నారద ఉవాచ ధర్మరాజా! దానవేశ్వరుని ఆదేశం మేరకు గురువులు ప్రహ్లాదునికి త్రైవర్గికమే ధర్మ, అర్థ, కామములనే బోధించారు. సామ, దాన, భేద, దండోపాయాలు నేర్పి పండితుని గావించామని భావించారు. ఇలా తనను గర్హించే (నిందించే) గురువులను కూడా ప్రహ్లాదుడు ఎప్పుడూ తనకు బరువులుగా భావించలేదు. పైపెచ్చు వారు చిత్తరువుల వలె పరాధీనులైన రాజ పురోహితులు. రాజును మన్నించి మెప్పిస్తేనే వారికి బ్రతుకు తెరువు. లేని యెడల, ఆదరువు మాట దేవుడెరుగు, దానవ దరువులతో వారి వీపులు చిట్లిపోయే ముప్పు మాత్రం ఎప్పుడూ పొంచి ఉంటుంది. కాని, తరువుల్లాంటి ఓర్పు కలిగిన ప్రహ్లాదుడు తన గురువులను నిచ్చలు నిత్యం, మెచ్చుకొంటాడేగాని నొచ్చుకోడు.
నారద ఉవాచ పాండునందనా! విద్య యొక్క పరిధి, హితం ధర్మార్థ కామముల వరకే పరిమితం కాదు. వీనిని మించి త్యాగముంది, పరహితముంది, అసంగత్వ (డిటాచ్మెంట్)ముంది. లోకంలో ధనం సంపాదించే శిక్షణే ప్రధానం కాని, ఆ ధనం రక్షణ, వ్యయం చేసే విచక్షణ, దానితో సుఖపడే విలక్షణ విధానం ఇవి నేర్పరు. భోగం నేర్పుతారు కాని దాని వలన భయంకరమైన శారీరక, మానసిక రోగాల బారిన పడకుండా ఉండే అసంగయోగం నేర్పరు. ధర్మం నేర్పినా దానిని దేవదేవునికి సమర్పించే మర్మాన్ని తెలపరు. ఇలా, ఈ త్రివర్గపు ఏకపక్షీయ (వన్సైడెడ్) బోధన వల్లనే లోకం శోకహతం అనేక వేదనలు, రోదనలతో సతమతమవుతోంది. ప్రజలు ఇంద్రియారాములై విషయాభిలాషులై, దాసులై, ద్వంద్వాలకు బందీలై అశాంతికి, చిత్తక్షోభకు లోనవుతున్నారు. ధర్మ పురుషార్థానికి అంతిమ ఫలం అపవర్గం మోక్షం. అంతేకాని కేవలం అర్థ సంపాదన కాదు. అర్థం సాధనమే కాని ఎన్నటికీ సిద్ధి పరమావధి, కాదు. అర్థానికి ధర్మాచరణమే ధ్యేయం కాని కామతృప్తి భోగానుభవం కాదు. కామ పురుషార్థానికి ‘జీవన నిర్వహణ’ వరకే ప్రయోజనం. అంతేకాని, ఎన్నటికీ సంతృప్తి పొందని ఇంద్రియ పరితృప్తి కాదు. మరి జీవితానికి సాఫల్యం? తత్తజిజ్ఞాస ఆత్మదర్శనం! అంతేకాని, కర్మ బాహుళ్యంతో స్వర్గలోక ప్రాప్తి కాదు. నాకం (స్వర్గం) ఎంత అస్తోక (విశాల)మైనా పుణ్యమనే పణ్యం పైకం ఉన్నంతవరకే. అది తరిగిపోతే తిరిగి తలక్రిందులుగా దోషారణ్యమైన ఈ భూలోకమే శరణ్యం! సశేషం
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006