న్యూఢిల్లీ, మే 29 : దేశంలో పలుచోట్ల కొనసాగుతున్న వరకట్న వేధింపులపై తీవ్రంగా విరుచుకుపడిన సుప్రీంకోర్టు, 2010లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక వరకట్న మరణం కేసులో బాధితురాలి భర్త కుటుంబ సభ్యులకు శిక్ష నుంచి ఉపశమనం కల్పించడానికి తిరస్కరించింది. పెండ్లయిన తర్వాత అత్తింటికి వచ్చిన కోడళ్లను అవమానించిన కుటుంబాలకు గట్టి సందేశం వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘ఎందుకు అబ్బాయిలు.. అమ్మాయిలను పెండ్లి చేసుకుని వారిని, వారి కుటుంబాలను అవమానిస్తారు? వధువును, వారి కుటుంబ సభ్యుల అవమానించడం ఇకపై కొనసాగించ లేరనే గట్టి సందేశం వారికి ఈ శిక్ష ద్వారా వెళ్లాల్సిందే’ అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.
వరుడు కుటుంబానికి శిక్ష నుంచి ఉపశమనం కల్పించడానికి ఆమె తిరస్కరించారు. జస్టిస్ భుయాన్ కూడా ఉన్న ఈ ధర్మాసనంలో కింది కోర్టు, ఛత్తీస్గఢ్ హైకోర్టు విధించిన శిక్షల్లో జోక్యం చేసుకోవడానికి తిరస్కరించింది. పిటిషనర్ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేస్తూ శిక్షను కొనసాగించాలని స్పష్టం చేసింది. కాగా, మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించిన ట్విషా అనే మహిళ ఆత్మహత్య కేసుపై విచారణ జరుగుతుండగా, అలాంటి తరహా కేసులోనే నిందితుల శిక్షను నిర్ధారిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం గమనార్హం.