రాజగురువులు రాకుమారుడైన ప్రహ్లాదునితో.. ‘నాయనా! ప్రహ్లాదా! మేము నూరిపోసిన నీతిపాఠాలే మీ నాన్నగారి వద్ద పలుకు. అంతేగాని, నేను సూరి (పండితుడ)నని నీవు నేర్చిన, నీకు నచ్చిన నీరజాక్షుని విద్యను- నారాయణ భక్తిని, మహారాజా వారి వద్ద అవ్వారిగా ఒలకబొయ్యమాక. హరిదాసునని సురవైరి ముందు భాసురంగా వాసుదేవుని ఊసు ఎత్తమాక.’ అంటూ బాలుని పలుమార్లు మెత్తగా బతిమలాడి, బుజ్జగించి ఒజ్జలు-గురువులు, తండ్రి పజ్జ (వద్ద)కు తెచ్చారు. విష్ణు చింతనలో విశ్వాన్ని విస్మరించే ప్రహ్లాదుని విశుద్ధ భక్తి పారవశ్యాన్ని వర్ణించే ఈ సీస పద్యం పోతన సొంతం..
సీ॥ ‘అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచు వాని,
నంభోజ గర్భాదు లభ్యసింపఁగ లేని హరిభక్తి పుంభావమైన వాని,
మాతృ గర్భము సొచ్చి మన్నది మొదలుగాఁ జిత్తమచ్యుతుమీఁదఁ జేర్చువాని,
నంకించి తనలోన నఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలఁగు వాని’
తే॥ ‘వినయ కారుణ్య బుద్ధి వివేక లక్ష
ణాది గుణముల కాటపట్టయిన వాని
శిష్యు బుధలోక సంభావ్యుఁజేరి గురుఁడు
ముందరికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కు మనుచు’
నారద మహర్షి ధర్మరాజుతో.. యుధిష్ఠిరా! ఆ కాయాధవుడు (కయాధు-లీలావతి పుత్రడు) మాయాధవుని- మాధవుని ధ్యాన మాధుర్యంలో తన కాయము (దేహము)నే- తన్నుతానే, మరచిపోతాడు. అంభోజ గర్భుడు (బ్రహ్మ), జంభాసురవైరి (ఇంద్రుడు) వంటి బృందారక (దేవతా) ప్రముఖులు కూడా అభ్యసింప (నేర్చుకో)లేని హరిభక్తియే పుంభావమైన వాడు- పురుషాకృతిగా ప్రభవించినవాడు. పుట్టింది మొదలు పురుషోత్తముని మీదే బుద్ధి పెట్టినవాడు. ‘విశ్వమంతా విష్ణుదేవుని లీలా వైభవ విలాసమే’ అని భావిస్తూ లోలోన ఆనందం అనుభవించువాడు, పండితులచే దండిగా- పరిపరివిధాల పొగడబడువాడు. అట్టి ఉత్తమగుణ గరిష్ఠుడైన రాజపట్టిని- ప్రహ్లాదుని గురువు, తండ్రికి మ్రొక్కమని మెల్లగా ముందుకు తోశాడు. ‘రక్షోవంశాధీశ్వర! వీక్షింపుము నీ కుమారు విద్యాబలమున్’- రాక్షస రాజా! నీ పుత్రుని పాండిత్యాన్ని పరీక్షించి వీక్షించు, అన్నాడు.
వినయంతో తనకు వందనం చేస్తున్న తనయుని చూచి కన్నతండ్రి కనక కశిపుడు కనులవెంట ఆనందాశ్రువులు జాలువారగా బాలుని ఆశీర్వదించి, అక్కున చేర్చుకొని, తొడపై కూర్చోబెట్టుకొని, తల నిమిరి, చెక్కిలి ముద్దాడుచూ మిక్కిలి మక్కువతో ‘చక్కని తండ్రీ! నీ చదువుల సారం తెలుసుకోవాలని తహ-తహలాడుచున్నా. ‘పద్యంబొక్కటి సెప్పి సార్థముగ దాత్పర్యంబు భాషింపుమా’- నీవు నేర్చిన శాస్త్రంలోని ఏదో ఒక పద్యం వినిపించి, దాని అర్థ తాత్పర్యాలు వివరించు. ‘ననుఁగన్న తండ్రి! భవదీయోత్కర్షముం జూపమవే!’- నా చిన్నితండ్రీ! చదువులో నీ చాతుర్యాన్ని చూపించు, నన్ను మురిపించి మైమరపించు’ అని ఎంతో ఆశతో తియ్యగా తనయునితో పలికాడు. అడగటమే తడవుగా బుడతడు తడబడకుండా తండ్రికి ఒక్కపట్టున గట్టిగా చదువుల గుట్టును రట్టు చేశాడు..
కం॥ ‘చదివించిరి నను గురువులు,
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్లఁ జదివితి దండ్రీ!’
ప్రహ్లాదుడు పితాశ్రీతో ప్రసన్నంగా ఇలా.. ‘నాన్నగారూ! నన్ను గురువులు చాలా చక్కగా చదివించారు. నేను ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, శిక్షా వ్యాకరణాది ప్రధాన శాస్ర్తాలన్నీ అవధాన పూర్వకంగా- శ్రద్ధగా, వ్యవధానం లేకుండా చదివాను. నేను చదివినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ మీకెందుకు లెండి? చదువుల మర్మాన్ని- రహస్యాన్ని ఒక్కమాటలో చెబుతా, వినండి, మన్నించండి’ అని నర్మగర్భంగా పలికాడు.
ఏమిటా మర్మమంటే (ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి- ఏ ఒక్కటి తెలిస్తే, వింతగా అంతా తెలిసిపోతుందో) ఏకరువు పెడతాడిలా చెలరేగి ఏకబిగిగా అలవోకగా..
మ॥ ‘తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్ వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచుఁదలతున్ సత్యంబు దైత్యోత్తమా!’
రాక్షస రాజా! సఖ్యం (స్నేహం), శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మ నివేదనం, కీర్తనం, చింతనం అనే ఈ తొమ్మిది భక్తి మార్గాల- విధానాలచే, మనసా వాచా కర్మణా – త్రికరణ శుద్ధిగా అంతఃకరణంలో అంతటికీ ఆత్మ అయిన అచ్యుత పరమాత్ముని నమ్ముకొని మానవుడు జీవితం వమ్ము కాకుండా, వంచన లేకుండా మనుగడ సాగించడం మంచిదని నేను తలంచుచున్నాను. నా దృష్టిలో ముమ్మాటికీ సత్యం ఇదే. సఖ్యం- స్నేహం. చెదరని విశ్వాసంతో కుచేలుని వలె కలిమి-లేములలో సమంగా కాంచనచేలుడు (సువర్ణ వస్త్రధారి) శ్రీమహావిష్ణువు- కృష్ణునితో చెలిమి! శ్రవణ భక్తి- భగవంతుని కల్యాణాత్మకమైన నామ, రూప, గుణ లీలా కథాశ్రవణం, దాస్యం- ‘సర్వ కర్మ సమర్పణం’ అని శ్రీధర స్వామి. ‘దంసయతే స్వామి కార్యాణి సావధానేన ఇతి దాసః’- స్వామి సేవను సావధానంగా, శ్రద్ధగా సాధించుట, సాగించుట దాస్యభక్తి. అహంకారాన్ని నిర్మూలించే ‘దాసోహం’ భావమే దాస్యభక్తికి మూలం. దీనికే ‘కింకరస్య భావః’ కైంకర్యమని మారుపేరు. వందనం- అంజలి ఘటించుట, ‘సాష్టాంగం ప్రణతిః’ అని సాగిలపడి నమస్కరించుట.
‘మద్యాజీ మాం నమస్కురు’ (నన్ను అర్చించు, నాకు నమస్కరించు) అని గీతలో భగవానుని ఆదేశం! ‘న మమ న మమ’ నాది కాదు, నాది కాదు అంతా నీదే- ‘త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే’ అన్న మమకార రాహిత్యమే ‘నమః’- వందన భక్తి. వందన భక్తులందరూ భగవంతునికి అభినందనీయులే! అర్చన భక్తి అనగా పూజించుట- పరాత్పరుని భావంతో ప్రతిమలను పూజించుట. విగ్రహారాధన మనో నిగ్రహం కొరకే! ‘పూజాదిష్వను రాగ ఇతి పారాశర్యః’- పూజాదికములలో పరమ ప్రేమ కలిగి ఉండుట భక్తి- అన్న వ్యాసుని నిర్వచనాన్ని నారద మహర్షి తన భక్తి సూత్రాలలో నిబంధించాడు. సేవనమనగా భగవత్పాదపద్మ భజనం, పరిచర్యలు చేయుట. ఆత్మ నివేదనం- దేహ సమర్పణమని శ్రీధరులు. గోవును గాని, గుర్రాన్ని గాని అమ్మిన పిమ్మట వాటి పాలన పోషణాదుల చింత ఎలా ఉండదో, అలాగే దేహాన్ని దేవదేవునికి సమర్పించి ఇక దాని (దేహ) విషయంలో నిశ్చింతగా ఉండుట అనే సంపూర్ణ శరణాగతి లేక ఆత్మార్పణమే ‘ఆత్మనివేదన’ భక్తి! దీనినే ‘ఆత్మని వేదనం’గా స్వీకరించి సహజ పాండిత్యుడు పోతన ‘ఆత్మలో నెరుకయున్’ (సర్వం వాసుదేవుడే అన్న స్ఫురణ- అనుభవం, మనసులో నిలిచిపోవడం) అని సరసంగా అనువదించాడు. (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006