Yadagirigutta Lakshmi Narasimha Swamy Brahmotsavalu | బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు! బ్రహ్మ జనకుడి కల్యాణోత్సవాలు! వేద రక్షకుడికి వేదోక్త పూజలు! ముల్లోకాలను నడిపించేవాడికి.. గజతురగాది వాహన సేవలు! నానా దిక్కుల నరులతోపాటు.. ముక్కోటి దేవతలూ ఒక్కటై వస్తారు. నరసింహతత్వానికి పెట్టనికోట.. యాదగిరిగుట్ట వేడుకల్ల్లో ఎన్నో విశేషాలు.
యుగాలనాటి లక్ష్మీనరసింహ క్షేత్రం.. యాదగిరిగుట్ట. ఆ ఆలయ చరిత్రలో ఎన్నో మలుపులు. అనేక పూజా విధానాలు. మూడొందల ఏండ్ల క్రితం.. వానమామలై జీయర్ స్వామి పాంచరాత్రాగమం ప్రకారం.. రామానుజ సంప్రదాయాన్ని స్థిరపరిచారు. నాటినుంచీ నిత్యోత్సవాలు మొదలు బ్రహ్మోత్సవాల వరకు.. పూజాదికాలన్నీ అదే పద్ధతిలో నడుస్తున్నాయి. అర్చకుల మంత్రోచ్చారణ, పండితుల వేద పారాయణ, రుత్వికుల ప్రబంధ పాఠాల నడుమ… ఫల్గుణ మిత్రుడైన స్వామికి ఏటా ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించే సంప్రదాయమూ అప్పుడే మొదలై ఉండవచ్చు. బ్రహ్మాది దేవతలతోపాటు మనమూ ఆ వేడుకలో పాల్గొందాం రండి. ‘నమో నారసింహ’ నినాదాలను వైకుంఠం దాకా వినిపిద్దాం పదండి.
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవ వేడుకల్లో తొలి అధ్యాయం.. విష్వక్సేన ఆరాధన. ఇతను విష్ణు గణాలకు అధిపతి. వైకుంఠ సేనాని. చతుర్భుజుడు. ముమ్మూర్తులా విష్ణువులా ఉంటాడు. కశ్యపుడు పెంచి పెద్దచేశాడని చెబుతారు. వేదాలు ఆపోశన పట్టాడు. మంత్రశాస్త్ర పారంగతుడు. విష్వక్సేన ఆరాధనకు వైష్ణవంలో అపార ప్రాధాన్యం ఉంది. విష్వక్సేనుడిని కొలిస్తే
సమస్త విఘ్నాలూ తొలగిపోయి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని పాంచరాత్రాగమ శాస్త్రం సూచిస్తున్నది.
అదె వచ్చె నిదెవచ్చె నచ్యుతు సేనాపతి..
పది దిక్కులకు నిట్టె పారరో అసురులు..
అంటూ విష్వక్సేనుడి పరాక్రమాన్ని కీర్తిస్తారు తాళ్లపాక అన్నమాచార్యులు.
స్వస్తి అంటే మంగళప్రదం, శుభప్రదం అనే అర్థమూ ఉంది. నిజమే, స్వామి ఉత్సవాలను మించిన మంగళ కార్యం మరేం ఉంటుందీ? జగద్రక్షకుడి బ్రహ్మోత్సవాల్లో రక్షాబంధన వేడుక అతి కీలకం. సర్వకల్యాణ దాయకం, సర్వశత్రు వినాశనం, ఆయురారోగ్య ప్రదాయకం, సంతానప్రదం. పవిత్ర కంకణాలను మంత్రబద్ధం చేసి.. భగవానుడికి, అమ్మవారికి అలంకరించి.. ఆ తర్వాత భక్తకోటి ధరిస్తారు. కంకణ స్పర్శతో సకల రోగాలూ తొలగిపోతాయని నమ్మకం. అదే రోజు సాయంత్రం.. ఆదివరాహమూర్తి అవతారంలో భూదేవిని ఉద్ధరించిన భగవానుడిని వేదమంత్రాలతో అర్చిస్తారు. ‘విష్ణుపత్నీం మహీం దేవీం మాధవీం మాధవ ప్రియామ్..’ అంటూ తైత్తిరీయ సంహితంలోని భూసూక్తంతో భూదేవిని కొలుస్తారు.
మృత్సంగ్రహణం కోసం.. అంటే, మట్టిని సేకరించడానికి అనుమతి కోరుతూ ముందుగా భూదేవిని ప్రార్థిస్తారు. ఆ మృత్తికపై భగవానుడిని చిత్రించి.. మంత్రోచ్చాటన మధ్య ఓ మట్టిపాత్రలో నింపి.. నవధాన్యాలను పోసి మంత్రశక్తితో చైతన్యవంతం చేస్తారు. శుక్లపక్ష చంద్రుడిలా నవధాన్యాలు వృద్ధి చెందాలనీ.. దాంతోపాటే సకల లోకాలూ సస్యశ్యామలంగా ఉండాలని ధాన్యలక్ష్మిని పూజిస్తారు. అంకురం అంటే బీజం. అది జీవాత్మలను సూచిస్తుంది. మట్టి పాత్ర శరీరానికి ప్రతీక. విత్తు మొలకెత్తి మొక్కగా మారడం అంటే.. జీవాత్మవికసించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందడమే. బ్రహ్మోత్సవాల్లో ధాన్యాన్ని మొలకెత్తించడం వెనకున్న అంతరార్థం ఇదే.
‘సకల దేవతలకూ జయం కలిగించి.. అసురులను నాశనం చేయాలనే సంకల్పంతో ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారు’ అంటుంది వైఖానసం. బ్రహ్మోత్సవాలలో తొలి పూజ ఇదే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి తిరుకల్యాణ మహోత్సవానికి సకల దేవతల్ని ఆహ్వానించే బాధ్యత గరుత్మంతుడికి అప్పగించడమే ఈ వేడుక పరమార్థం. ఆ ఘట్టానికి అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణందార్లు, యాజ్ఞిక బృందం శ్రీకారం చుడతారు. దేవదేవుడితో గరుడాళ్వారు అనుబంధం ప్రగాఢమైంది. ‘ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలె’ అంటూ ఆ ఇద్దరూ కలిసి దుష్ట సంహారానికి బయల్దేరే ఘట్టాన్ని వర్ణిస్తుందో కీర్తన. ఇక బ్రహ్మోత్సవాలకు వస్తే.. ధ్వజారోహణ ఘట్టానికి ముందు ప్రధానాలయంలో యాగశాల ప్రవేశం, ద్వార తోరణం, ధ్వజకుంభారాధన, మహాకుంభారాధన, చతుస్థానార్చన నిర్వహిస్తారు. వివిధ హోమాలు జరుపుతారు. ధ్వజారోహణం అనంతరం అష్టదిక్పాలక బలిహరణ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవంగా నిర్వహించే వేడుక ధ్వజారోహణ మహోత్సవం. ధ్వజం అంటే.. కదిలేది అని అర్థం. ధ్వజాన్ని స్తంభానికి కట్టడం వల్ల ధ్వజస్తంభం అనే పేరు సార్థకమైంది. బ్రహ్మాండ పురాణం ఈ వేడుక ప్రత్యేకతను తెలిపింది. ధ్వజ దండాన్ని పూజించాక.. తెల్లని వస్త్రంపై గరుత్మంతుడిని చిత్రించి.. 27 విధాలైన ఉపచారాలు నిర్వహించి.. చతుర్వేద మంత్ర సహితంగా దేవతలను ఆవాహనం చేస్తారు. భేరీ తాండవం కూడా ఓ గొప్ప క్రతువే. ఈ ధ్వనికి దుష్టశక్తులు పారిపోతాయని విశ్వాసం. రాగ, తాళ, స్తోత్రపాఠాల నడుమ.. అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. దేవతాహ్వాన కార్యక్రమంలో భాగంగా.. సభాస్థానంలో స్వామివారిని పెండ్లికొడుకును చేసి 33 కోట్ల దేవతలను.. 33 రాగాలు, 33 తాళాలు, 33 వేదమంత్రాలతో సగౌరవంగా భూలోకానికి ఆహ్వానిస్తారు. ఒక్కో దేవతకు మూడురకాల ఉపచారాలు చేసి బ్రహ్మోత్సవంలో పాలుపంచుకోవాలని కోరుతారు. దేవతలందరికి స్వామివారి దివ్యవిమాన గోపురంలో వసతి సౌకర్యాలు, నైవేద్య కైంకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిస్తారు. ఇలా వచ్చిన దేవతలంతా బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు స్వామివారి సన్నిధిలోనే కొలువుదీరుతారు.
కోర దవడలతో..
కోటిసూర్య తేజంతో..
హారకేయూరాది భూషణాంబరాలతో..
శంఖచక్రాలతో..
జంట పూదండలతో ..
మెరిసిపోతుంటాడు..
ముల్లోకాలకూ మూలమైన దేవుడు.
స్వామి వేదవేద్యుడు. వేదరక్షణ కోసం మత్స్యావతారాన్ని ధరించాడు. సోమకుడనే రాక్షసుణ్ని సంహరించి.. ఆ జ్ఞాన సంపదను బ్రహ్మదేవుడికి అనుగ్రహించాడు. ఈ అలంకారంలో నరసింహుడిని దర్శించినవారి అజ్ఞానం నశిస్తుందని, విజ్ఞానం విస్తరిస్తుందని.. ఆత్మ, పరమాత్మల వివేకం కలుగుతుందని చెబుతారు. ఈ వేడుక సమయంలో పట్టుపీతాంబరాలు, నవరత్నఖచిత ఆభరణాలతో భక్తులకు దర్శనమిస్తాడు స్వామి. మంగళవాయిద్యాలు, వేద మంత్రాల నడుమ శేష వాహనం మీద ఊరేగుతాడు. సృష్టి ఆరంభంలో మర్రాకు మీద పవళించిన స్వామిని వటపత్రశాయిగా కొలుస్తారు. ఈ అవతారంలో హంస వాహనం మీద ఊరేగే దేవదేవుడిని దర్శించుకుంటే కలి ప్రభావం ఆమడదూరంలోనే ఆగిపోతుందని విశ్వాసం.
బ్రహ్మోత్సవాల్లో స్వామి.. తన ద్వాపరయుగ అవతారాన్ని ధరించి మురళీకృష్ణుడై.. భక్తజనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తాడు. కన్నయ్య పొన్న వాహనంపై ఊరేగుతాడు. కొండ వేలనెత్తిన గోవిందుడు ‘గోవర్ధన గిరిధారి’ రూపంలో దర్బారు నిర్వహిస్తాడు. సింహవాహన సేవను స్వీకరిస్తాడు. గోవింద పట్టాభిషేక సమయంలో ఇంద్రుడి దర్పాన్ని అణచిన స్వామి.. దర్శనమాత్రంతోనే మన అహాన్నీ కరిగిస్తాడు. మందగించిన బుద్ధిని శుద్ధి చేస్తాడు. క్షీరసాగర మథనంలో సురులకు అమృతపు విందులు వడ్డించిన జగన్నాథుడు జగన్మోహిని అవతారంలో జనం మధ్యలోకి వస్తాడు. అశ్వవాహనమెక్కి నలుదిక్కులకూ విహరిస్తాడు. గుర్రం చంచలత్వానికి ప్రతీక. కళ్లాలతో గుర్రాన్ని నియంత్రించినట్టు.. నవవిధ భక్తి మార్గాలతో మనసును స్థిరపరుచుకోవాలన్నది ఈ సేవ సంకేతం. తిరుకల్యాణంలో ప్రధాన ఘట్టమైన ఎదుర్కోళ్లు ఉత్సవం ఆ రోజే బాలాలయంలో ఆరంభం అవుతుంది. మరుసటి రోజు.. దశకంఠుడిని సంహరించిన దశరథ పుత్రుడై నరసింహుడు హనుమంత వాహనంపై ఊరేగే ఘట్టం నయనానందకరం. కావవే వరద.. సంరక్షించు భద్రాత్మకా.. అంటూ ఆర్తితో పిలిచిన గజేంద్రుడి కోసం.. సిరికిన్ జెప్పక, శంఖచక్రముల్ ధరింపక పరుగెత్తుకుని వెళ్లిన పరమాత్మ గజ వాహనంపై ఊరేగుతాడు. పాలకడలిపై శేష తల్పమున శ్రీలక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చే స్వామి బ్రహ్మోత్సవాల్లో మహావిష్ణువుగానూ పూజలందుకుంటాడు. గరుడవాహనాన్ని అధిష్టిస్తాడు.
ఇక, స్వామివారి కల్యాణం.. ముల్లోకాలకూ పండగే. ఆ వేడుక ఎదుర్కోళ్లతో ఆరంభమై మాంగల్యధారణతో ముగుస్తుంది. సాక్షాత్ మన్మథ మన్మథః అంటూ వరుడి సౌందర్యాన్ని మన్మథుడితో పోలుస్తారు. మన్మథుడే అంత అందగాడైతే.. అతని తండ్రి ఇంకెంత సుందరాకారుడై ఉంటాడు? ఇక అమ్మవారి రూప లావణ్యాన్ని మాటల్లో చెప్పలేం? ముక్కోటి దేవతలు అతిథులుగా బ్రహ్మాదుల సమక్షంలో యాదాద్రి నృసింహుడు సముద్రరాజ తనయ మెడలో మాంగల్యధారణ చేస్తారు. ఆ ఇద్దరిదీ అన్యోన్య దాంపత్యం. ప్రతి అవతారంలోనూ శ్రీదేవి పరమాత్మకు తోడై నిలిచింది. నీడై నడిచింది. ఆయనతోపాటు, ఆయన కోసమే పుట్టింది. పుట్టెడు కష్టాలను చిరునవ్వుతో అనుభవించింది. అందులోనూ, లక్ష్మీ నరసింహుల అనుబంధం మరీ ప్రత్యేకం. కోమలాంగి అయిన కొల్హాపురవాసిని కోరల దేవుడిని కోరికోరి వరించింది. మహోగ్రరూపుడిని పరమ శాంతమూర్తిగా మార్చేసిందా కాంతామణి. నరసింహుడు మాత్రం తక్కువ వాడా! చంచల అయిన క్షీరాబ్ధి కన్యకు తన ఒడిలో, హృదిలో స్థానమిచ్చి.. స్థిరత్వాన్ని ప్రసాదించాడు. లక్ష్మీ నరసింహులు ఒకరి కోసం ఒకరు సహజ స్వభావాన్నే మార్చుకున్నారు. ఆధునిక దంపతులకు ఆదర్శమై నిలిచారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా దివ్యవిమాన రథంపై భక్తులకు దర్శనమిస్తాడు పురుషోత్తముడు. వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో ఆ దివ్యరథాన్ని అలంకరిస్తారు. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే.. రథారూఢుడైన స్వామిని దర్శించుకుంటే మనోరథాలు నెరవేరుతాయని, జననమరణాల జంజాటంలోంచి బయటపడతారని విశ్వాసం. భక్తుల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ.. పట్టణ వీధులలో ఉత్సవమూర్తి ఊరేగుతాడు. ఆ కోలాహలాన్ని చూడాల్సిందే!
పరిపూర్ణులైన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పూర్ణాహుతి ఓ ముఖ్యఘట్టం. తొమ్మిది రోజుల వేడుకలో తెలిసో, తెలియకో పొరపాట్లు జరిగి ఉంటే.. పెద్ద మనసుతో క్షమించమంటూ ఆశ్రిత రక్షకుడిని వేడుకుంటారు. అగ్ని దేవుడికి హవిస్సును సమర్పిస్తారు. చక్రధారికి చక్రస్నానం చేయించే ఘట్టం కమనీయం, రమణీయం. ప్రత్యేకంగా సిద్ధంచేసిన పుష్కరిణిలో లక్ష్మీసమేతుడైన యాదగిరీశుడు స్నానమాచరించే సమయంలో భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు. సకలలోక పాలకుడైన యాదగిరి లక్ష్మీనరసింహుడు పూల రంగడు, పుష్పాభిమాని. కాబట్టే, బ్రహ్మోత్సవాల వేళ ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. అనంతరం దేవతోద్వాసన జరుగుతుంది. ముక్కోటి దేవతలు తిరుగు ప్రయాణం అవుతారు. స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలో 108 కలశాలు, 108 ద్రవ్యాలు, 108 ఓషధులు, 108 మంత్ర జపాలతో వేదయుక్తంగా అర్చిస్తారు. అష్టోత్తర శత ఘటాల్లోకి ముక్కోటి దేవతలను ఆవాహన చేసి ఆహుతులను సమర్పిస్తారు. 108 సంఖ్యలో భగవానుడి తత్తం నిక్షిప్తమై ఉన్నందున అష్టోత్తర శతఘటాభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీవారిని అమ్మవార్లను పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటితో అభిషేకిస్తారు. సాయంత్రం శ్రీస్వామివారి శృంగార డోలోత్సవం అత్యంత వైభవంగా చేపడతారు. ఉత్సవ పరిసమాప్తికి సూచకంగా మంగళ నీరాజనాలు పలుకుతారు.
బాల్యం నుంచి యాదర్షి నృసింహభక్తుడు. అతని తండ్రి రుష్యశృంగుడు. తల్లి శాంతాదేవి. ఆ బాలుడు పసితనం నుంచీ నరసింహుడి కథలే వినేవాడు. నరసింహుడి పాటలే పాడుకునేవాడు. ఆ స్వామి నిజరూపాన్ని దర్శించుకోవాలనే ఆరాటం. ప్రహ్లాదుడిలా పరమాత్మ ఎదుట నిలబడి ప్రస్తుతించాలని కోరిక. ఆ విన్నపం సత్యయుగం నాటి స్వామికి చేరేదెలా? అనుకోకుండా మారుతి కటాక్షం లభించింది. రామసేతు నిర్మించిన హనుమంతుడు.. ఆ భక్తునికి, భగవంతునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించాడు. నృసింహ మంత్రం ఉపదేశించాడు. ఆ భక్తికి మెచ్చి, ఆ సాధన నచ్చి.. సింహరూపుడైన శ్రీహరి కొండగుహలో దర్శనమిచ్చాడు. జ్వాల.. యోగానంద.. గండభేరుండ.. ఉగ్రనరసింహ.. లక్ష్మీనరసింహ.. ఐదు అవతారాల్లో కరుణించాడు.
నమామ్యహం మానవ సింహం
ప్రమదాంక మహోబల సింహం
దానవ దైత్య విదారణ సింహం
నానాయుధకర నరసింహం
భూ నభోంతరాళ పూరిత సింహం
ఆనన వహ్ని లయాంతక సింహం
శాంత నృసింహం శౌర్య నృసింహం
సంతత కరుణా జయసింహం..
..అంటూ కొనియాడాడు యాదరుషి.
తనను కటాక్షించిన గుహలోనే.. సామాన్య భక్తులకూ దర్శనం ఇవ్వమని ప్రార్థించాడు. భక్త సులభుడు సులభంగానే అంగీకరించాడు. స్వయంభూమూర్తిగా గుట్ట మీద వెలిశాడు. స్వామివారికి అభినవ వైద్యుడు అని పేరు. ఆరోగ్య ప్రదాత, ఐశ్యర్యాన్ని అనుగ్రహించే మహాదాత కూడా!
భువనగిరి పాలకుడు త్రిభువనమల్లుడు. తొలుత నరసింహుని ఉనికిని ప్రశ్నించాడు, పరమాత్మ తత్వానికి సవాలు విసిరాడు. సింహరూపుడైన శ్రీహరి మాత్రం.. అతని చేయి వదల్లేదు. యుద్ధాలలో ఆయుధమై నిలిచాడు. అనారోగ్యాలలో ఔషధమై ఆదుకున్నాడు. సంక్షోభాలలో ఆత్మీయుడై వెన్నంటి నిలిచాడు. సకల భాగ్యాలతోపాటు సంతాన భాగ్యాన్నీ ఇచ్చాడు. ఆ వాత్సల్యం కారణంగానే త్రిభువనమల్లుడు త్రికరణ శుద్ధిగా నరసింహ భక్తుడయ్యాడు. యథాశక్తిగా ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తున్నది. కృష్ణదేవరాయలు కూడా గుట్ట దేవుడిని సేవించి తరించాడని ఐతిహ్యం. కాలక్రమంలో.. అరాచకాలు ప్రబలాయి. స్వామివారి పూజాదికాలు ఆగిపోయాయి. చుట్టూతా చిట్టడవితో.. ఆ క్షేత్రం క్రూరమృ
గాలకు ఆవాసమైంది. ఆ దశలో స్వామి ఓ గ్రామాధికారికి దర్శనమిచ్చి.. తన ఉనికిని సూచించాడట. హైదరాబాద్ వాస్తవ్యుడు మోతీలాల్ చొరవతో ఈ క్షేత్రానికి పాత వైభవం వచ్చింది. నిజాం నవాబులూ ఇతోధికంగా సహకరించారని అంటారు. శ్రీ వైష్ణవాచార్యులు నిత్యపూజలను శాస్ర్తోక్తం చేశారు. ఈగ బుచ్చిదాసు, బాపట్ల లక్ష్మీకాంతయ్య తదితర సంకీర్తనాచార్యులు వేనోళ్ల కొలిచి వేవేల పుణ్యాలు గడించారు. వంగీపురం నర్సింహాచార్యులు రచించిన సుప్రభాత, మంగళాశాసనాది రచనలు నేటికీ గర్భాలయంలో ప్రతి
ధ్వనిస్తున్నాయి.
ఒక నిజభక్తుడి సంకల్పం.. సాకారమైంది. వైకుంఠమే దిగొచ్చింది. కృష్ణశిలతో మహాద్భుతం ఆవిష్కృతమైంది. యాదగిరిగుట్ట ఇప్పుడు అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం. జగద్విఖ్యాత
వైష్ణవ క్షేత్రం. యాదాద్రి ఆలయం వెయ్యేండ్ల వరకూ పటిష్ఠంగా నిలవాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. ఆ స్థాయి నాణ్యత కోసమే సంప్రదాయ పద్ధతులలో ఆలయ నిర్మాణం
చేపట్టారు. వేల కోట్ల నిధులు కేటాయించారు.
వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు
యెనసి బ్రహ్మాండము లేలిరట
పెనకొని వారల పేరులు మరచిరి
మనుజ కీటముల మరెవ్వడెరుగు?
ఎంతోమంది పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొన్ని పేర్లనే జనం తలుచుకుంటారు. కొందరి పాలననే విద్యార్థులు చరిత్రగా చదువుకుంటారు. స్వామిని మెప్పించిన భక్తుడిగా, యాదాద్రి క్షేత్రానికి పునర్వైభవం తెచ్చిన కర్మయోగిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరూ చిరస్థాయిగా నిలిచిపోతుంది.
సింగారాల మించీ నరసింహదేవుడు
చెంగట నున్నాడు నరసింహదేవుడు
సురలు జయవెట్ట నసురులెల్ల మొరవెట్ట
సిరితో మెలగీ నరసింహదేవుడు
ధరణి వంపెట్ట బ్రతిధ్వనులు మిన్నులు ముట్ట
శిరసెత్తె నలి నరసింహదేవుడు..