తిరుమల : కలియుగ దైవం శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోసం దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ చైర్మన్ (TTD Chairman ) బీఆర్ నాయుడు ( BR Naidyu ) శనివారం భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో కొందరు దళారులు , మధ్యవర్తులు ( Middlemen ) శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను పలు మార్గాల ద్వారా మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ముఖ్యంగా టీటీడీలోను, ప్రభావిత స్థానాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులమని కొందరు మాయమాటలతో మెరుగైన శ్రీవారి బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కల్పిస్తామని ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. ఇలాంటి నకిలీ వ్యక్తులు భక్తుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి మోసం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. ఇప్పటికే భక్తులను మోసం చేస్తున్న దళారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భక్తులు టీటీడీ సేవలకు సంబంధించి https://ttdevasthanams.ap.gov.in , ttdevasthanams మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్లో తమ ఆధార్ కార్డు ఆధారంగా బుక్ చేసుకోవాలని కోరారు. టీటీడీ సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించాలని సూచించారు. దళారులపై అనుమానం వస్తే టీటీడీ విజిలెన్స్ అధికారులు 0877-2263828 సదరు ఫోన్ నెంబర్ లో నిరంతరం అందుబాటులో ఉంటారని, ఫిర్యాదు చేయాలని సూచించారు.