వృద్ధుడికి సాయంగా వచ్చిన యువకుడి నిర్వాకం
ఖిలావరంగల్, ఏప్రిల్ 30 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు తాను చెప్పిన గుర్తుపై ఓటు వేయమని కోరితే ఆ యువకుడు కాంగ్రెస్ చేతి గుర్తుపై ఓటు వేసి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. బ్యాలెట్ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుండటంతో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు మామునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటకు చెందిన సోల్తీ రంజిత్ హైదరాబాద్లో ఆటో డ్రైవర్. ఎన్నికల్లో ఓటు వేసేందుకు బొల్లికుంటకు వచ్చాడు. అయితే బొల్లికుంటకు చెందిన ఓ వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతూ ఓటు వేసేందుకు రంజిత్ సాయం తీసుకున్నాడు. పోలింగ్ బూత్లోకి వెళ్లిన తర్వాత ఏజెంట్లు, ఎన్నికల అధికారులు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఆ వృద్ధుడు కారు గుర్తుకు ఓటు వేయమని చెబితే అలాగే అని చెప్పి చేతి గుర్తుకు వేశాడు. అంతటితో ఆగని రంజిత్.. బ్యాలెట్ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది. దీంతో ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.