జడ్చర్ల మన్సిపాలిటీకి 241 నామినేషన్ల దాఖలు
అడిషన్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పరిశీలన
జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 18 : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఆదివారంతో ముగిసింది. ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ ప్రక్రియలో జడ్చర్లకు మొత్తం 27 వార్డులకుగానూ 208 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, మొత్తం 241 సెట్ల దాఖలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 43, బీజేపీ 42, ఎంఐఎం 9, సీపీఐ 4, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 79 నామినేషన్ల దాఖలయ్యాయి. మొదటిరోజు నిల్, రెండో రోజు 19, చివరిరోజు ఏకంగా 222 నామినేషన్లు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థుల సందడి నెలకొన్నది. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల ముఖ్య నేతల హల్చల్ కనిపించింది. వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఊరేగింపుగా కేంద్రాల వద్దకు వచ్చారు. డప్పులు, మేళతాళాల మధ్య టీఆర్ఎస్ అభ్యర్థులు ఊరేగింపు వచ్చి రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య సమక్షంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పర్యవేక్షించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాలంటూ అభ్యర్థులకు సూచించారు. సీఐ వీరాస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సోమవారం పరిశీలన ప్రక్రియను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
అచ్చంపేటలో 148 నామినేషన్లు
అచ్చంపేట రూరల్, ఏప్రిల్18: అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మొదటి రోజు టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ ఒకటితో మొత్తం 4, రెండో రోజు టీఆర్ఎస్ 25, కాంగ్రెస్ 11, బీజేపీ 7, స్వతంత్ర అభ్యర్థులు 2 కలిపి మొత్తం 45, మూడో రోజు టీఆర్ఎస్ 34, కాంగ్రెస్ 35, బీజేపీ 21, ఎంఐఎం 2, స్వతంత్ర అభ్యర్థులు 7 మొత్తం 99 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడ్రోజుల్లో 148 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ దాఖలలో విప్ గువ్వల బాల్రాజు పాల్గొని సంబంధిత అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. నేటి నుంచి రేపటి వరకు నామినేషన్ల పరిశీలన, అనంతరం 22 సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా వెలువడనున్నట్లు అసిస్టెంట్ ఎన్నికల అధికారి శ్రీహరి రాజు పేర్కొన్నారు.
అలంపూర్ వార్డు
సభ్యత్వానికి నామినేషన్లు
అలంపూర్, ఏప్రిల్18: అలంపూర్ మున్సిపాలిటీలో 5వ వార్డు కౌన్సిలర్ ఎరుకలి దేవన్న అకాల మరణంతో ఆరు నెలలు కిందట ఖాళీ అయిన వార్డు స్థానానికి తిరిగి ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. .నామినేషన్ల చివరి రోజు 5వ వార్డుకు రెండు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి కరుణాకర్, ఏఆర్వో శ్రీవాణి తెలిపారు.మాజీ కౌన్సిలర్ దేవన్న భార్య లక్ష్మీ దేవమ్మ టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రెండు నామినేషన్ సెట్లను ఆదివారం దాఖలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి కౌన్సిలర్ సుదర్శన్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణరెడ్డి, వెంకట్రామయ్యశెట్టి, షేక్ హుసేన్ వలీ, పెద్ద మక్తార్ దేవరాజు, నాగరాజు, మద్దిలేటి, చిలుకూరి శ్రీనివాసులు, మల్లెపోగు శేఖర్, ఖాసీం, సత్యం, విక్రం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
వేధించే నోటిపూతకు సులువైన పరిష్కారం
కేంద్రం నల్ల చట్టాల వల్లే ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు