సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 26 : తెలంగాణలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు రాష్ట్ర విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో మంగళవారం నుంచి జిల్లాలోని 1744 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, 105 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మూత పడనున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వేసవి సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలో రెండో దశ కరోనా ఉధృతి దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యక్ష బోధనకు స్వస్తి పలికిన విషయం తెలిసిందే. కేవలం ఆన్లైన్ తరగతులను మాత్రమే నిర్వహిస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులకు ఎండాకాలం తీవ్రత దృష్ట్యా కొన్ని రోజులుగా మధ్యాహ్నం వరకే విధులు నిర్వహించాలనే ఆదేశాల మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విధులకు హాజరయ్యారు. విద్యార్థులకు ఎక్కడి నుంచైనా ఆన్లైన్ తరగతులు నిర్వహించవచ్చని, పాఠశాలలకు రావడం ద్వారా ఒకింత కరోనా బారినపడే అవకాశాలు ఉన్నందున రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను నేరుగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సెమిస్టర్ కారణంగా డిగ్రీ తరగతులు..?
అటు పాఠశాలలు, ఇటు జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించినప్పటికీ డిగ్రీ కళాశాలలకు మాత్రం ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ విద్యలో సెమిస్టర్ విధానం అమలులో ఉన్నందున ఉన్నత విద్యాశాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో దాదాపు 18 డిగ్రీ ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా, అందులో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీరంతా రోజుకు కనీసం 6 గంటల విధులు నిర్వహిస్తూ బయోమెట్రిక్ హాజరును నమోదు చేస్తున్నారు. కళాశాల నుంచే విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో తరగతులు బోధిస్తున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో అధ్యాపకులు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేందుకు జంకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేసి రిజిస్టర్లో సంతకాలు పెట్టేందుకు అనుమతించాలని అధ్యాపకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా యావత్ దేశంతోపాటు రాష్ట్రంలోనూ కరోనా వేగంగా విస్తరిస్తున్నందున వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయ పద్ధతిలో 50 శాతం హాజరునైనా కొనసాగించాలని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు కోరుతున్నారు.
పాజిటివ్ కేసులతో బెంబేలు..
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలల్లో పలువురు అధ్యాపకులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో తోటి అధ్యాపకులు, సిబ్బంది భయంతో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత వారం రోజుల క్రితం ఓ గెస్ట్ ఫ్యాకల్టీకి కరోనా పాజిటివ్ రావడంతో సదరు అధ్యాపకురాలు హోం ఐసొలేషన్లో ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం మరో రెగ్యులర్ ఫ్యాకల్టీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సోమవారం కళాశాలలోని అన్ని విభాగాలను శానిటైజ్ చేశారు. మరో ఇద్దరు అధ్యాపకుల పరీక్షా ఫలితాలు రావాల్సి ఉన్నందున కళాశాలకు వచ్చే అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది భయం గుప్పిట్లో విధులకు హాజరవుతున్నారు. ఇప్పటికైనా బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని ఉన్నత అధికారులను కోరుతున్నారు.