Chicken Curry | చికెన్ కర్రీ (Chicken Curry) విషయంలో తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారి తీసింది. ఇంట్లో వండిన చికెన్ కర్రీ మొత్తం తండ్రి తినేయడంతో కొడుకు గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన తండ్రి.. కుమారుడి తల పగలగొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కర్ణాటక ( Karnataka) రాష్ట్రం దక్షిణ కన్నడ (Dakshina Kannada) జిల్లాలోని సూలీయా తాలూకా (Sullia taluk) గుత్తిగర్ (Guttigar) గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శివరామ్ (33) అనే వ్యక్తి కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం పనిమీద బయటకు వెళ్లాడు. అయితే అదే రోజు ఇంట్లో కోడి కూర వండగా.. కుమారుడికి కొంచెం కూడా ఉంచకుండా తండ్రి సీన మొత్తం తినేశాడు. పనిముగించుకొని తిరిగొచ్చిన శివరామ్ విషయం తెలుసుకుని తండ్రితో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన తండ్రి.. పక్కనే ఉన్న దుడ్డుకర్ర తీసుకుని కుమారుడి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శివరామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి శివరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడు శివరామ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read..
Cape Cobra | విమానం గాల్లో ఉండగా.. కాక్పిట్లో ప్రత్యక్షమైన కేప్ కోబ్రా.. !
Prakash Raj | సుదీప్ నిర్ణయంతో చాలా బాధపడ్డా : ప్రకాశ్ రాజ్
India Corona | 5 వేలకు పైనే కొత్త కేసులు.. 25 వేలు దాటిన యాక్టివ్ కేసులు!