గ్రామం నలువైపులా పచ్చదనం
పల్లె ప్రగతితో రూపురేఖలు
నిత్యం చెత్తసేకరణ, పారిశుధ్య పనులు
జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్
దేవరకద్ర రూరల్, మే2: జీనుగురాల గ్రామం పల్లె ప్రగతికి తలమానికంగా నిలిచింది. గ్రామం నలువైపులా 90శాతం మొక్కలు నాటడంతో ఆహ్లాదపరుస్తున్నాయి. పల్లె ప్రకృతి వనంలో పలు రకాల మొక్కలతో పాటు చిన్న పిల్లలు ఆడుకోవడానికి జారుడుబండ, ఊయలతో పాటు పలు ఆటవస్తువులు కూడా ఏర్పాటు చేశారు.
ఉత్తమ పంచాయతీగా..
పల్లె ప్రగతిలో భాగంగా జీనుగురాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు జరిగాయి. పల్లె ప్రగతిలో చేసిన పనులకుగానూ గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డును గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అప్పటి కలెక్టర్ రొనాల్డ్రోస్ నుంచి సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి అందుకున్నారు. వైకుంఠధామం, ప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్డు, మొక్కలు పెంపకం, వంద శాతం మరుగుదొడ్లు, మెరుగైన పారిశుధ్యం, మిషన్ భగీరథ నీటి సరఫరా ఇలాంటి అభివృద్ధి ఫలాలను గ్రామస్తులకు అందిస్తున్నారు.
వెల్లి విరుస్తున్న పచ్చదనం
పల్లె ప్రకృతివనంతో పాటు గ్రామం నలువైపులా 90శాతం లక్ష్యం మేర మొక్కల పెంపకం చేపట్టారు. మొక్కలు ఏపుగా పెరుగుతూ పచ్చదనంతోపాటు ఆహ్లాదాన్నిస్తున్నాయి. గ్రామంలో నర్సరీ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మొక్కలకు నీళ్లు పడుతున్నారు. ప్రతి రోజూ చెత్తను ట్రాక్టర్తో, తోపుడు బండ్లతో సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
అభివృద్ధి పనులు పూర్తి
గ్రామంలో రూ.25లక్షలతో సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో గుంతల రోడ్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు తిప్పలు తప్పాయి. ఉపాధి హామీ పథకం ద్వారా పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. 40వేల లీటర్ల సామర్థ్యంగల తాగునీటి ట్యాంకుతో పాటు 90వేల లీటర్ల సామర్థ్యం గల మిషన్ భగీరథ నీటి ట్యాంకు ఉంది. రూ.50 లక్షలతో 8గదులతో ప్రాథమికోన్నత పాఠశాల భవన నిర్మాణం పూర్తి కావస్తుంది.