కామారెడ్డి : తెల్లారితే కూతురు నామకరణోత్సవం..వేడుక కోసం ఆ కుటుంబం అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. దుస్తులు, విందు అవసరమైన సామగ్రి అంతా సిద్ధం చేసుకున్నారు. శుభకార్యంతో సందడిగా మారాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం నిండింది. ఈ హృదయవిదారక సంఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని నల్లమడుగు గ్రామానికి చెందిన మెట్టు ప్రభాకర్ (32) అనే రైతు పాము కాటులో మృతి చెందాడు. ప్రభాకర్ శనివారం రాత్రి గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద కాపలాకు వెళ్లాడు. అర్ధరాత్రి ప్రభాకర్కు కడుపులో తిప్పినట్లు కావడం, వాంతులు చేసుకోవడంతో పక్కనే ఉన్న మరో రైతుకు తెలిపాడు.
దీంతో ఆయనకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆదివారం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డికి తరలించారు.
ప్రభాకర్ చెవి వెనుక భాగంలో పాము కాటు వేయడంతో మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య ప్రసన్న ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
Road accident | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి