అహ్మదాబాద్ : సైబర్ నేరాలపై ప్రజల్లో పోలీసులు ఎంత అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (cyber fraud) చెలరేగుతూనే ఉన్నారు. ఆన్లైన్ వేదికగా అమాయకుల ఖాతాల నుంచి క్షణాల్లో నగదు మాయం చేస్తున్నారు. తాజా ఘటనలో గుజరాత్లోని జామ్నగర్కు చెందిన ఓ జంట నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ. 1.12 కోట్లు లూటీ చేశారు. టికెటింగ్ బిజినెస్లో ఇంటి నుంచి పనిచేస్తూ అదనపు ఆదాయం పొందవచ్చని జంటను మభ్యపెట్టిన స్కామర్లు పెద్ద మొత్తంలో దండుకున్నారు. వివిధ భాషలకు చెందిన మూవీలను చూసి వాటికి రేటింగ్ ఇవ్వాలని, అందుకు మూవీ టికెట్లు కొనుగోలు చేయాలని నమ్మబలికారు.
టెలిగ్రాంలో ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉందని జంటకు స్కామర్లు అడ్వర్టైజింగ్ మెసేజ్ పంపారు. మూవీలు రేటింగ్ ఇస్తూ ఇంటి నుంచే సంపాదించుకోవచ్చని ఆశచూపారు. ఇలా చేస్తే రోజూ రూ. 2500 నుంచి రూ. 5000 వరకూ ఆర్జించవచ్చని మెసేజ్లో ప్రలోభపెట్టారు. ఆఫర్ గురించి వివరాలు తెలుసుకోవాలనే ఆరాటంతో బాధిత జంట సెండర్ను ఆశ్రయించగా ఫేక్ వెబ్సైట్పై వారిని రిజిస్టర్ చేస్తూ పాస్వర్డ్ జనరేట్ చేశారు. ఆపై టెలిగ్రాం గ్రూప్లో కూడా వారిని సభ్యులుగా యాడ్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాగానే సినిమాలను చూసి వాటికి రేటింగ్స్ ఇవ్వాలని కోరారు. ఇక మూవీలకు రేటింగ్స్ ఇచ్చేందుకు హాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది హిందీ డబ్బింగ్ సినిమాలతో సహా వీరు 28 సినిమాల టికెట్స్ను కొనుగోలు చేశారు.
ఈ మూవీలకు వీరు ఇచ్చే రేటింగ్స్ ప్రకారం ఒక్కో మూవీకి రూ. 2500 నుంచి రూ. 5000 వరకూ ఇస్తామని స్కామర్లు నమ్మబలికారు. ముందుగా వారి నమ్మకం చూరగొనేందుకు డబ్బు ఇవ్వడంతో పాటు పెద్దమొత్తంలో కమిషన్ ముట్టచెప్పారు. మూవీస్కు రేటింగ్ ఇవ్వడం ద్వారా, టికెట్ల కొనుగోలుపై కమిషన్ ఆదాయం కలుపుకుని మహిళ రూ. 5 లక్షల వరకూ ఆర్జించారు. ఈ మొత్తం విత్డ్రా చేసేందుకు మహిళ ప్రయత్నించగా, ఎక్కువ మొత్తం ఆర్జించేందుకు ఆ మొత్తంతో టికెట్లు కొనుగోలు చేయాలని స్కామర్లు బాధితురాలిని కోరారు. ఇలా బాధిత జంట తమ డబ్బును విత్డ్రా చేసుకునేందుకు కూడా అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ స్కామ్లో కూరుకుపోయారు.
ఈ క్రమంలో వారు మొత్తం రూ. 40 లక్షలు టికెట్ల కొనుగోలుకు వెచ్చించారు. ఈ మొత్తం విత్డ్రా చేసేందుకు వారు మొగ్గుచూపగా పెద్దమొత్తంలో నగదు విత్డ్రా చేస్తున్నందున అడ్వాన్స్గా సర్చార్జి చెల్లించాలని స్కామర్లు నమ్మబలికారు. ఆపై మహిళను మీరు పెద్దమొత్తంలో నగదు విత్డ్రా చేస్తే మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటారని అందుకే ఈ మొత్తం మరో స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించగా బాధిత జంట మొత్తం రూ. 1.12 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. ఈ క్రమంలో తాము మోసపోయామని గ్రహించిన జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. జామ్నగర్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితుడు స్మిత్ పటోలియా (21)ను సూరత్లో అదుపులోకి తీసుకున్నారు.
Read More