Uttar Pradesh | రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రించిన ఓ కుటుంబం (Family)లోని ఐదుగురు చిన్నారులు తెల్లారేసరికి విగతజీవులుగా మారడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అమ్రోహా (Amroha) జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు సోమవారం రాత్రి భోజనం చేసి ఇంట్లో పడుకున్నారు. అయితే, సోమవారం రాత్రి మూసుకున్న తలుపులు మంగళవారం సాయంత్రం అయినా తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అందులో ఐదుగురు చిన్నారులు విగతజీవులై కనిపించారు. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ ఇద్దర్నీ వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు. ఇంటి యజమాని రహీజుద్దీన్గా గుర్తించినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుపమ్ సింగ్ తెలిపారు. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు రహీజుద్దీన్ సంతానం కాగా, మిగతా ఇద్దరు బంధువుల పిల్లలని చెప్పారు. ఈ ఘటనలో రహీజుద్దీన్ భార్యతో పాటు అతడి తమ్ముడు చావుబతుకుల్లో ఉన్నట్లు వివరించారు.
చలికావడంతో ఇంట్లో వెచ్చగా ఉండేందుకు పెట్టుకున్న బొగ్గుల కుంపటి వల్లే పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. గదిలోకి గాలి వచ్చే మార్గం లేకపోవడం, కుంపటి నుంచి వెలువడిన కార్బన్ డయాక్సైడ్ కారణంగా గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Alaska Airlines | తప్పు మాదే.. మళ్లీ ఇలా జరగదు : డోర్ ఊడిన ఘటనపై అలాస్కా ఎయిర్లైన్స్
Mohammed Shami | ‘అర్జున’ అందుకోవడం గర్వంగా ఉంది : షమీ
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం