న్యూఢిల్లీ : ఫరీద్ కోట్ దవాఖానకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి కొనుగోలు చేసిన నాసిరకం వెంటిలేటర్లను పంపారని పంజాబ్ ఆరోగ్య శాఖ చేసిన ఆరోపణలపై కేంద్రం గురువారం స్పందించింది. తాము పంపిన వెంటిలేటర్లలో చాలా యంత్రాలు మెరుగ్గా పనిచేసేవేనని, కేవలం కొన్ని వెంటిలేటర్లలో మైనర్ రిపేర్లు అవసరమవుతాయని పేర్కొంది. ఫరీద్ కోట్ లోని జీజీఎస్ బోధనాసుపత్రికి పీఎం కేర్స్ ఫండ్ నుంచి కేంద్ర ప్రభుత్వం పంపిన వెంటిలేటర్లు పనిచేయడం లేదని, తయారీదారుల నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో వాటిని మూలనపడేసినట్టు పలు మీడియా కథనాలు వెల్లడయ్యాయి.
ఇది అరకొర సమాచారం మాత్రమేనని, ఈ కథనాలు పూర్తి వాస్తవాలను ప్రతిబింబించడం లేదని కేంద్రం పేర్కొంది. జీజీఎస్ ఆస్పత్రికి పంపిన వెంటిలేటర్లలో చాలా మెషీన్లు సరిగ్గానే పనిచేస్తున్నాయని బీఈఎల్ వెల్లడించిందని, ఆ సంస్ద ఇంజనీర్లు ఆస్పత్రి నుంచి వచ్చిన ఫిర్యాదులపై గతంలో పలుమార్లు అక్కడికి వెళ్లి అవసరమైన మరమ్మత్తులను చేపట్టారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.