పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి, జూన్ 5 : జీవకోటికి మొక్కలే ప్రాణాధారమని… పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వేంసూరు రోడ్లోని అర్బన్పార్కులో మొక్కలు నాటి అనంతరం పార్కు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఏటా కోట్లాది మొక్కలను నాటుతూ తెలంగాణను హరిత తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఎన్నో రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయన్నారు. అర్భన్ పార్కులో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రతి ఏడాది ఒక్కో థీమ్ను ఎంపిక చేసుకుని పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారని అన్నారు. ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతతో ఒక మొక్కను నాటి వాటిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ రమాకాంత్, ఎఫ్ఆర్వో వెంకటేశ్వర్లు, మున్సిఫల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కౌన్సిలర్లు అద్దంకి అనిల్, మట్టా ప్రసాద్, మల్లూరు అంకమరాజు, చాంద్పాషా, నరుకుళ్ల శ్రీనివాసరావు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.