పెళ్లైన నాయికలు సినిమాలకు దూరమవుతారు అనే చరిత్రను తిరగరాస్తున్న బాలీవుడ్ (Bollywood) నాయిక విద్యా బాలన్ (Vidya Balan). ఆమె కెరీర్ గతంలో కంటే ఇప్పుడే వేగంగా సాగుతున్నది. పాండమిక్ టైమ్ లోనూ విద్యా బాలన్ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేశాయి. మ్యాథ్స్ జీనియస్ శకుంతలా దేవి బయోపిక్, షేర్ని చిత్రాల్లో ఆకట్టుకున్న విద్యా…ఇటీవల జల్సా చిత్రంతో మెప్పించింది. ఆమె ఖాతాలో ప్రస్తుతం మూడు చిత్రాలున్నాయి.
వాటిలో ఒకటి పాండమిక్ నేపథ్యం (Covid Pandemic)తో ఉండబోతున్నది. కరోనా సమయంలో అంతా ఎలాంటి కష్టాలు పడ్డారు, వాళ్ల జీవితాలు ఎలాంటి భావోద్వేగాలతో సాగాయి అనేది ఈ సినిమాలో ఎమోషనల్ గా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించనుంది. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందీ సినిమా.
కథా నేపథ్య చిత్రాలు చేస్తున్న విద్యా బాలన్కు అవకాశాలు ఏ దశలోనూ తగ్గడం లేదు. శకుంతలా దేవి చిత్ర దర్శకుడితో ఓ మర్డర్ మిస్టరీ సినిమాకు అంగీకరించింది విద్యా. పాండమిక్కు ముందే కుదిరిన ఈ సినిమా ఇప్పటిదాకా ఆలస్యమవుతూ వచ్చింది. ఇది కాక దర్శకురాలు అనూ మీనన్ (Anu Menon) క్రైమ్ డ్రామాలోనూ విద్యా నటిస్తున్నది. ఈ మూడు చిత్రాలు రెండేళ్లపాటు ఆమెను తీరిక లేకుండా చేయనున్నాయి.