బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి ఏడాది కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. కేవలం 34 ఏళ్ల వయసులో గత ఏడాది జూన్ 14న ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత సుశాంత్ మరణం చుట్టూ ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దానికి తోడు డ్రగ్ రాకెట్ కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ ఇలా ఉంటే ఈయన మాజీ ప్రేయసి అంకిత లోఖండే కూడా సుశాంత్ సింగ్ రాజ్పుత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. ఇద్దరూ కలిసి దాదాపు ఆరేళ్ల సహజీవనం చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి మొదలైంది.
వయసులో సుశాంత్ కంటే అంకిత పెద్దది. అయినా కూడా ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. పవిత్ర రిస్టా సీరియల్ తో ఇద్దరు సూపర్ ఫేమస్ అయ్యారు. అప్పట్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బుల్లితెరపై నెంబర్ వన్ హీరో. అలాంటి స్థానం వదులుకొని సినిమాల కోసం వెళ్ళిపోయాడు సుశాంత్. అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా తన ప్రేయసి అంకితను వదిలిపెట్టలేదు సుశాంత్ సింగ్. ఇద్దరు పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఉన్నట్టుండి 2016లో ఇద్దరు విడిపోయారు. దీనికి కారణాలు ఏంటి అనేది అప్పట్లో ఎవరికీ తెలియదు.
తర్వాత ఎవరూ అడగలేదు కూడా. అంకితతో విడిపోయిన తర్వాత కృతి సనన్, రియా చక్రవర్తి లతో ప్రేమలో పడ్డాడు సుశాంత్ సింగ్. మరోవైపు అంకిత కూడా మరో సీరియల్ నటుడితో సహజీవనం మొదలు పెట్టింది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన అంకిత.. తాను సుశాంత్ నుంచి ఎందుకు విడిపోయాననేది చెప్పింది. అప్పట్లో తనకు కెరీర్ ముఖ్యం.. కొన్ని రోజులు ఇవన్నీ వద్దు అన్నందుకు.. సామరస్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని విడిపోయాము.. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని క్లారిటీ ఇచ్చింది. కేవలం కెరీర్ కోసమే సుశాంత్ తనతో విడిపోయాడు అంటూ చెప్పుకొచ్చింది. బ్రేకప్ అయిన తర్వాత ఒకరి గురించి ఒకరు పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పింది. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన తరువాత మాత్రం కొన్ని రోజులు తనలో తాను లేను అంటుంది.