పటాన్చెరు, మే 25 : లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి ఔటర్రింగ్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును ఆయన పరిశీలించారు. సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి డీజీపీకి పోలీసుల తనిఖీ వివరాలు అందించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపైకి వస్తున్న వాహనాలు, అంబులెన్స్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రహదారులపైకి ఉదయం 10గంటల తర్వాత ఎవరు రాకుండా కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. అంబులెన్స్లు, వైద్య సంబంధిత వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. ఈ పాస్ను చెక్చేసి వాహనాలను వదులాలని డీజీపీ చెప్పారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకరులతో మాట్లాడారు. కొవిడ్ మహమ్మారిని జయించాలంటే లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లాక్డౌన్లో చిన్నపాటి అవసరాలకు కూడా రోడ్లపైకి రావొద్దని ప్రజలకు సూచించారు. ఎమర్జన్సీ ఉన్నవారికి, మెడికల్ సర్వీస్ ఇస్తున్నవారిని పోలీసులు వదిలేయాలన్నారు. రోగులు, వారి సంరక్షకులుంటే వారిని అనుమతి ఇవ్వాలన్నారు. అంతర్రాష్ట్ర వాహనాల ఈ పాస్లు పరిశీలించి అనుమతులు ఇవ్వాలని కోరారు. పారిశ్రామికవాడల్లో ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమలు వందశాతం నడిచేలా అనమతులు ఇస్తున్నామన్నారు. సడలింపు తర్వాత ఇష్టారీతిన తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. సంగారెడ్డిలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. డీజీపీ వెంట సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్రెడ్డి ఉన్నారు.