హిందీ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన కథానాయికగా గుర్తింపు సంపాదించుకుంది హైదరాబాదీ అమ్మాయి దియా మిర్జా. కేవలం నటిగానే కాకుండా సామాజిక కార్యకర్తగా కూడా ఆమెకు మంచి పేరుంది. ‘వైల్డ్డాగ్’ చిత్రం ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమవుతోంది. నాగార్జున కథానాయకుడిగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా దియామిర్జా పాత్రికేయులతో ముచ్చటించింది.
ఈ సినిమా కోసం తొలుత దర్శకుడు అహిషోర్ సాల్మన్ నన్ను సంప్రదించాడు. నేను ఆసక్తి చూపడంతో స్క్రిప్ట్ మొత్తం పంపించాడు. కథతో కొత్తదనం, భావోద్వేగాలు నచ్చడంతో సినిమాకు ఒప్పుకున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా నాగార్జునకు నేను జీవితకాలపు అభిమానిని. నాగార్జున కుటుంబంతో మా కుటుంబానికి చాలా ఏళ్లుగా స్నేహసంబంధాలున్నాయి. బాల్యంలో నేను, నాగార్జున కోడలు సుప్రియ కలిసి పెరిగాం. ఆటపాటల్లో మేమిద్దరం బొమ్మల్ని షేర్ చేసుకునేవాళ్లం. నాగార్జునతో సినిమా ఆఫర్ అనగానే చాలా సౌకర్యవంతంగా ఫీలయ్యాను. దర్శకుడు అహిషోర్ సాల్మన్ కథ చెప్పిన విధానంలోనే అతని ప్రతిభ తెలిసిపోవడంతో రెండో ఆలోచన లేకుండానే సినిమాకు ఓకే చెప్పాను.
ఇరవైఏళ్ల విరామం తర్వాత..
దాదాపు ఇరవైఏళ్ల తర్వాత నాగార్జునను కలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. షూటింగ్కు ముందు మేమిద్దరం ఎలాంటి వర్క్షాప్స్ చేయలేదు. డైరెక్ట్గా సెట్స్లోకి వెళ్లిపోయాం. తొలి సన్నివేశంగా ఓ ఎమోషనల్ సీన్ను మా ఇద్దరిపై చిత్రీకరించారు. ఇరవైఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జునను కలుసుకున్నప్పటికీ ఆయనలోని సహృదయత, సింప్లిసిటీ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. దాంతో కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నటించాను. ప్రకృతి, అడవులు, పర్యావరణ పరిరక్షణ విషయంలో మా ఇద్దరి అభిరుచుల ఒకటే అవడంతో సెట్లో మంచి విషయాలు చర్చకు వచ్చేవి.
సామాజిక కార్యక్రమాలకు ప్రేరణ
దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న కనిపించని పోరాట యోధుల కథ ఇది. దేశం కోసం వారు చేసే పోరాటం, సంఘర్షణకు దృశ్యరూపంలా ఉంటుంది. అతిథి పాత్ర అయినప్పటికీ సినిమాలో నా క్యారెక్టర్ చాలా కీలకంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులు ప్రేమించే విధంగా ఉంటుంది. నేను 19ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. దాదాపు ఇరవైఏళ్లుగా కెరీర్లో రాణిస్తున్నా. సినిమాల ద్వారా సంపాదించుకున్న ఇమేజ్ సామాజిక, పర్యావరణహితం కోరుతూ కార్యక్రమాలు చేపట్టడానికి స్ఫూర్తినిచ్చింది. అవే నాకు నిజమైన సంతోషాన్నిస్తున్నాయి.
భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి
ప్రస్తుతం ఓటీటీ వల్ల విస్త్రతమైన సృజనాత్మకమైన ఆవిష్కరణ జరుగుతోంది. దర్శకులు తమ భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్ సినిమాలకు కూడా సెన్సార్ఫిష్ విధిస్తూ చట్టాన్ని చేయబోతున్నారు. అది చాలా తప్పనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని నేను కోరుకుంటాను. సినిమాలకు కూడా సెన్సార్ లేకుండా ప్రభుత్వపరమైన విధివిధానాలు మాత్రమే ఉంటే బాగుంటుందన్నది నా అభిప్రాయం. నేను హైదరాబాద్లో పుట్టిపెరిగాను. తెలుగులో అవకాశమొస్తే పూర్తిస్థాయి పాత్రలో సినిమా చేయాలనుంది.
ఇవి కూడా చదవండి:
రాజకీయ ప్రచారానికి వెళ్లినట్లనిపించింది!