Supreme Court | న్యూఢిల్లీ: తమిళనాడులో అక్రమ మైనింగ్ కేసులో జిల్లా కలెక్టర్లను అనవసరంగా వేధించొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దర్యాప్తు పేరుతో కలెక్టర్లను ఈడీ కార్యాలయంలోనే రాత్రి 8.30 వరకు కూర్చోబెడుతున్నారని రాష్ట్రప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో ఐదుగురు కలెక్టర్లను ఏప్రిల్ 25లోగా హాజరుకావాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు వారు ఈడీ ముందు హాజరయ్యారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. వారు ఈడీ ముందు హాజరయ్యారని, అయితే ఎలాంటి డాక్యుమెంట్లు కానీ, వివరాలు కానీ ఈడీకి అందజేయలేదని చెప్పారు. దీనికి సిబల్ స్పందిస్తూ.. ఈడీ సమన్లలో కోరిన వాటిని అందించినట్టు స్పష్టంచేశారు. ఏయే డాక్యుమెంట్లు ఇవ్వలేదో స్పష్టం చేయాలని ఈడీని ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. అనంతరం సిబల్ మాట్లాడుతూ.. కలెక్టర్లు 11 గంటలకు ఈడీకి ఆఫీసుకు వచ్చారని, వారిని రాత్రి 8.30 వరకు కార్యాలయంలోనే కూర్చోబెట్టారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ కలెక్టర్లను అనవసరంగా వేధించొద్దని ఈడీకి స్పష్టంచేసింది. తదుపరి విచారణను జూలైకి వాయిదా వేసింది.