Bheemadevarapally Branch | దివంగత దిగ్దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు పేరిట నెలకొల్పిన ‘డీఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో, మన యాస భాషలను ఆవిష్కరిస్తూ రూపొందించిన ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రం ఉత్తమ పొలిటికల్ సెటైర్ మూవీగా పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్ మాట్లాడుతూ ‘ఈ అవార్డును స్వీకరించడం గర్వంగా ఉంది. ఈ పురస్కారం సినీ ఇండస్ట్రీ పట్ల నాకున్న బాధ్యతను మరింతగా పెంచింది’ అన్నారు. ఇక ‘భీమదేవరపల్లి బ్రాంచి’ కథాంశం విషయానికొస్తే.. మోదీ ప్రవేశపెట్టిన జన్ధన్ పథకంలో భాగంగా అందరూ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు.
ఒకరి ఖాతాలో అనుకోకుండా 15లక్షలు పడతాయి. అ డబ్బులను ప్రభుత్వమే వేసిందని భావించిన సదరు యజమాని వాటిని మొత్తం ఖర్చు పెడతాడు. అయితే ఆ డబ్బులు జన్ధన్కు సంబంధించినవి కావని, బ్యాంకు తప్పిదం వల్ల అనుకోకుండా క్రెడిట్ అయ్యానని, వాటిని తిరిగి కట్టాల్సిందేనని బ్యాంకు వాళ్లు ఒత్తిడి తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో సదరు కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు, మోదీ చేసిన మోసాన్ని కళ్లకుకట్టినట్లుగా ఈ సినిమాలో ఆవిష్కరించారు. తెలంగాణ గ్రామీణ వాతావరణంలో స్థానిక యాస, భాషలకు పట్టం కడుతూ ఈ సినిమా అందరిని మెప్పించింది.