‘ఎంచుకునే ప్రతి కథలో వైవిధ్యంతో పాటు నటుడిగా నాకు సవాళ్లు ఉండాలని కోరుకుంటా. కొత్తదనం లేకపోతే సినిమాలు చేయను. ఈ ఆలోచన విధానం వల్లే ఇండస్ట్రీలో అడుగుపెట్టి పధ్నాలుగేళ్లయినా తక్కువ సినిమాలు చేశాను’ అని అన్నారు కార్తి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుల్తాన్’. బాక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో కార్తి పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
ప్రచార చిత్రాలు చూస్తేంటే మీ గత చిత్రాలకు భిన్నంగా కొత్తదనంతో కూడిన సినిమా ఇదని అనిపిస్తోంది?
వంద మంది అన్నయ్యలు ఉన్న ఓ తమ్ముడి కథ ఇది. రోబోటిక్ ఇంజినీర్ అయిన ఓ యువకుడు జపాన్లో స్థిరపడాలని కలలు కంటుంటాడు. అనుకోకుండా తండ్రి కారణంగా అతడు ఓ పెద్ద లక్ష్యాన్ని చేపట్టాల్సివస్తుంది. అదేమిటి? తండ్రి మాటను అతడు నిలబెట్టాడా?లేదా? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. దర్శకుడు బాక్కియరాజ్ కణ్ణన్ తొలుత 20 నిమిషాల ఐడియా వినిపించారు. అది నచ్చే సినిమాను అంగీకరించా.
ఈ సినిమాలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
వంద మంది రౌడీలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను స్వీకరించిన వ్యక్తిగా నా పాత్ర ఛాలెంజింగ్గా ఉంటుంది. తన స్వభావానికి విరుద్ధమైన వారిని అతడు ఎలా దారిలోకి తెచ్చుకున్నాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, వినోదం, యాక్షన్తో పాటు కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి. గత వారం రోజుల్లో నాలుగు సార్లు ఈ సినిమా చూశా. తొలిరోజు కథ విన్న సమయంలో ఏ అనుభూతికి లోనయ్యానో అదే ఫీలింగ్ సినిమా చూసిన ప్రతిసారి నాలో కలిగింది. మా కుటుంబసభ్యులకు ఈ సినిమా నచ్చింది.
లాక్డౌన్ పరిస్థితుల్లో భారీ కాస్టింగ్తో సినిమాను చేయడం ఛాలెంజింగ్గా అనిపించిందా?
ఈ సినిమాలోని ప్రతి సీన్లో వంద మంది ఆర్టిస్టులు కనిపిస్తారు. యాక్షన్ మాత్రమే కాదు లవ్సీన్లో వారంతా ఉంటారు. తొలిరోజు షూటింగ్ మొదలుపెట్టే సమయంలో ఏ లెన్స్ వాడితే వంద మంది కవర్ అవుతారో కెమెరామెన్కు అర్థంకాలేదు. ఎలాంటి రిఫరెన్స్ లేదు. నాలుగైదు రోజులు ఆ అంశాలపై పరిశోధన చేసిన తర్వాతే చిత్రీకరణ మొదలుపెట్టాం. ప్రతిరోజు షూటింగ్కు వెళ్లడానికి పన్నెండు బస్సులు అవసరమయ్యేవి. రాజకీయ ప్రచారానికి వెళ్లిన ఫీలింగ్ కలిగేది.
నాగార్జునతో పోటీగా మీ సినిమా విడుదల అవుతోంది? ఈ పోటీ గురించి మీరేమంటారు?
నేను ఎప్పుడు హైదరాబాద్కు వచ్చినా నాగార్జున, వంశీపైడిపల్లిలను తప్పకుండా కలుస్తుంటా. ‘ఊపిరి’ సినిమాతో నాగార్జున ఆత్మీయుడిగా మారిపోయారు. నాగార్జున ‘వైల్డ్డాగ్’ విడుదల రోజే నా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఆనందంగా ఉంది. ‘వైల్డ్డాగ్’ ప్రీరిలీజ్ వేడుకలో నాగార్జునగారు మా సినిమా గురించి మాట్లాడటం, హిట్ కావాలని కోరుకోవడం ఆయన మంచి మనసుకు నిదర్శనం.
రష్మిక మందన్న పాత్రకు కథలో ఎంతవరకు ప్రాముఖ్యముంటుంది?
పల్లెటూరి కథాంశంతో రష్మిక మందన్న చేసిన తొలి సినిమా ఇది. పల్లెటూళ్ల గురించి తనకు ఎలాంటి పరిజ్ఞానం లేదని ఈ సినిమా సెట్స్లో అడుగుపెట్టిన తర్వాతే అర్థమైంది. ఈ సినిమాలో ట్రాక్టర్ నడపటం, పాలు పితకడం లాంటి అన్ని పనుల గురించి రష్మిక తెలుసుకుంది. పల్లెటూరి జీవితంలోని కష్టాలేమిటో ఈ సినిమాతో ఆమెకు అవగతమైంది. ఆమె పాత్రకు కథలో ప్రాధాన్యముంటుంది. శక్తివంతంగా, బోల్డ్గా సాగుతుంది.
మీ కెరీర్ ఉన్నతిలో నాన్న, అన్నయ్య పాత్ర ఎంతవరకు ఉంటుంది?
తొలి సినిమాకు మాత్రమే నాన్న, అన్నయ్య సలహాలు తీసుకున్నా. రెండో సినిమా నుంచి నేనే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నా. అసిస్టెంట్ డైరెక్టర్గా నాకున్న పరిజ్ఞానంతో స్వీయ నిర్ణయాలు తీసుకోమని అన్నయ్య చెప్పిన మాటకు కట్టుబడిపోయా. ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలని అనుకున్నా. కొన్నాళ్ల తర్వాత ఆ ఆలోచనను పక్కనపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ చేరిపోయా. నాన్న బలవంతం మీదనే నటుడిగా మారాను. యాక్టింగ్ వర్కవుట్ కాకపోతే దర్శకత్వ విభాగంపై దృష్టిపెట్టాలనుకున్నా. ఆ అవసరం రాలేదు.
అన్నయ్య సూర్యతో కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా?
ఈ ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు. అన్నయ్యతో సినిమా చేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇద్దరం కలిసి ఓ పోలీస్కథతో సినిమా చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే తప్పకుండా కలిసి సినిమా చేస్తాం.
ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేస్తారంటూ ప్రచారం జరిగింది?
ఓటీటీలో విడుదలచేయమని చాలా ఆఫర్స్ వచ్చాయి. థియేటర్లలోనే విడుదలచేయాలని తిరస్కరించాం. ఓటీటీలో సినిమాను విడుదలచేయాలనే నిర్ణయం హీరో ఒక్కరిదే కాదు. కొన్నిసార్లు అందరి బాగును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంది. రిస్క్ అయినా వాటికి హీరోలు కట్టుబడి ఉండాల్సివస్తుంది. అన్నయ్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ విషయంలో అదే జరిగింది. మూడేళ్ల క్రితం సినిమా మొదలవ్వడంతో నిర్మాతలే ఆ సినిమాను ఓటీటీలో విడుదలచేశారు.
తదుపరి సినిమాల విశేషాలేమిటి?
మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ 70 శాతం పూర్తయింది. లైఫ్టైమ్ ఎక్స్పీరియన్స్ను పంచే చిత్రమిది. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించా. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేయబోతున్నా.
ఇవి కూడా చదవండి:
సినిమాలకు సెన్సార్ అవసరం లేదు!