పాలమూరులో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తాం
కుల, మతాలను కూకటివేళ్లతో పెకిలించి వేయాలి
జగ్జీవన్రామ్ కాంస్య విగ్రహావిష్కరణలో మంత్రి శ్రీనివాస్గౌడ్
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 5: డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జగ్జీవన్రాం జయంతిని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా సాంఘిక, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉత్సవాలకు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన జగ్జీవన్రామ్ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. రిజర్వేషన్ల ద్వారా వచ్చిన వారు బడుగు, బలహీన వర్గాల్లో ఉన్న పేదలను తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. పాలమూరులోని గడియారం చౌరస్తా వద్ద అంబేద్కర్, సేవాలాల్ మహరాజ్, జ్యోతిభా ఫూలే వంటి మహనీయుల విగ్రహాలను పెడుతామన్నారు. సమాజంలో నెలకొన్న కుల, మతాలను కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మంచి పనులు చేస్తూ జన్మను సార్థకం చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్, సేవాలాల్ మహరాజ్, జ్యోతిబాపూలే వంటి మహనీయుల విగ్రహాలను చౌరస్తాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, డీఎస్పీ శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కమిషనర్ ప్రదీప్కుమార్, రెడ్క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, దళిత సంఘాల నాయకులు రాయికంటి రాందాస్, భీమయ్య, శ్రీనివాస్, హనుమంతు, చంద్రనాయక్ కురుమూర్తి, బాలపీర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి