పటాన్చెరు, జూన్ 16 : కొవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి వ్యాక్సినేషన్ నిర్వహిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలుస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నా రు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు ఫ్రంట్లైన్ వారియర్స్, హైరిస్క్ గ్రూప్స్, 45 సంవత్సరాలు నిండిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందించడంతో పాటు ప్రైవేట్ దవాఖానల్లోనూ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా కృషి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా నియంత్రణలో ఉందని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసారిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. డ్వాక్రా మహిళలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో కార్పోరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పనగేశ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ బాలయ్య, డ్వాక్రా మహిళలు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్కుమార్, షకీల్, సత్యనారాయణ, అజ్మత్ పాల్గొన్నారు.