ఖైరతాబాద్, ఏప్రిల్ 23: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ల కల్పనపై అన్ని పార్టీలు స్పష్టత ఇవ్వాలని నంగారా భేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గిరిజనుల ఓట్లే కీలకంగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు దాటినా ఇంకా గిరిజనుల సంక్షేమంపై మాట్లాడటం లేదన్నారు. కనీసం మంత్రివర్గంలోనూ అవకాశం కల్పించలేదన్నారు. తమ ఓట్లతో గెలిచి ఇలాంటి వైఖరిని ప్రదర్శిస్తే బుద్ధి చెబుతామన్నారు. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ప్రకటనలో ఆర్టికల్ 244(1) అనుసరించి ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలను స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలన్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా అందులో జనరల్, ఏజెన్సీ వేర్వేరుగా ఇవ్వాలన్నారు. అలాగే, ఐటీడీఏలోని బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేసి వంద శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించేందుకు తీర్మానం చేయాలన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందే స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో జూన్ 20న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద గిరిజనుల మహాధర్నా కార్యక్రమం చేపడుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమురం బుచ్చయ్య దొర, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ సోమేశ్, తెలంగాణ గోండ్వాన విద్యార్థి సంక్షేమ పరిషత్ రాస్ట్ర కన్వీనర్ ఇర్పా ప్రకాశ్ దొర, మహబూబ్నగర్ ఉమ్మడి జల్లా ఏజెన్సీ జేఏసీ జిల్లా అధ్యక్షులు వడిత్యా రాజు నాయక్, లంబాడీ విద్యార్ధి సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా కుమార్, వి.రమేశ్, స్వామి రాథోడ్, దీపక్ పాల్గొన్నారు.