ఇప్పుడు దేశమంతా తెలుగు సినిమా వైపు చూస్తుంది. ఇక్కడ వస్తున్న కథలను బాలీవుడ్ సహా పలు సినీ ఇండస్ట్రీలు రీమేక్ చేసుకుంటున్నాయి. మన హీరోలతో పాన్ ఇండియా సినిమాలు తీసేందుకు పరాయి భాష డైరెక్టర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇతర భాషల్లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న హీరోలు కూడా తెలుగులో ఒక్క సినిమా అయినా చేయాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్కు పరిచయమైన హీరోలు.. స్ట్రెయిట్గా తెలుగు సినిమా చేసి తమ మార్కెట్ను పెంచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్ వంటి తమిళ స్టార్స్ తెలుగులో సినిమాలు చేసేందుకు సిద్ధమవ్వగా.. తాజాగా రెమో సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన శివకార్తికేయన్ కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అమితాబ్ నుంచి తెలుగులో నటించిన ఇతర భాషలో హీరోలు ఎవరు ఉన్నారో ఒకసారి చూద్దాం..
కె.బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ చిత్రంతో తొలిసారిగా తెలుగులో నటించాడు రజినీ. ఆ తర్వాత చిలకమ్మ చెప్పింది, తొలిరేయి గడిచింది, వయసు పిలిచింది వంటి చిత్రాలతో పాటు సూపర్ స్టార్ కృష్ణతో అన్నదమ్ముల సవాల్, ఇద్దరు అసాధ్యులే, ఎన్టీఆర్తో టైగర్, శోభన్బాబుతో జీవన పోరాటం , చిరంజీవితో కాళి వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించారు. మోహన్ బాబు హీరోగా వచ్చిన పెదరాయుడు సినిమాలో కూడా రజినీ అతిథి పాత్రలో నటించారు. చివరగా జగపతిబాబుతో కలిసి కథానాయకుడు ద్విభాషా చిత్రంలో నటించాడు రజినీకాంత్.
కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అంతులేని కథలో చిన్న పాత్రతో తెలుగు తెరపై తొలిసారి మెరిశాడు కమల్ హాసన్. ఆ తర్వాత మరో చరిత్ర, అంతులేని కథ, సొమ్మొకడిది సోకకడిది, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, సాగర సంగమం, స్వాతిముత్యం, ఇంద్రుడు చంద్రుడు, శుభ సంకల్పం వంటి తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో నటించాడు.
1993లో వచ్చిన ప్రేమ పుస్తకం అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించాడు అజిత్. ఈ సినిమాకు గొల్లపూడి మారుతీరావు దర్శకత్వం వహించారు.
చిరునవ్వుల వరమిస్తావా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు విక్రమ్. ఆ తర్వాత బంగారు కుటుంబం, ఆడాళ్లా మజాకా, ఊహా, మెరుపు, 9 నెలలు వంటి తెలుగు సినిమాల్లో నటించాడు.
తమిళ డబ్బింగ్ సినిమా బాయ్స్ తో టాలీవుడ్కు పరిచయమైన సిద్ధార్థ.. కెరీర్ తొలినాళ్లలో తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడటంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయాడు. చివరగా తెలుగులో బాద్షా సినిమాలో నటించిన సిద్దార్థ్ ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్లీ మహాసముద్రం సినిమాతో టాలీవుడ్కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్ మన తెలుగువాడే. అందుకే ప్రేమచదరంగం, పందెంకోడి, పొగరు, భయ్యా వంటి డబ్బింగ్ సినిమాలను టాలీవుడ్లో అందరించడంతో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని చాలాకాలంగా అనుకున్నాడు. సెల్యూట్, పిస్తా సినిమాలను తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు.
తమిళ హీరో సూర్యకు టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర 2 లో నటించాడు.
తమిళ హీరో ఆర్య కూడా తెలుగులో నటించారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన వరుడు సినిమాలో ఆయన నటించాడు. ఆ తర్వాత అనుష్క సైజ్ జీరోలోను ఆర్య కనిపించాడు.
తమిళ హీరో కార్తికి తెలుగులో మంచి పేరే ఉంది. ఈయన నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో నటించాడు.
స్నేహం కోసం, వాసు వంటి సినిమాల్లో నటించిన విజయ్ కుమార్ కుమారుడే ఈ అరుణ్ విజయ్. తమిళంలో హీరోగా వెలుగొందుతున్న అరుణ్ విజయ్.. రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్రూస్లీ సినిమాలో నటించాడు. ఆ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సాహోలోనూ కీలక పాత్రలో నటించాడు అరుణ్ విజయ్.
తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తమిళ హీరో విజయ్ సేతుపతి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈయన మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డితో డైరెక్ట్గా తెలుగు సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఉప్పెనతో ఆకట్టుకున్నాడు.
తమిళ యువ హీరో అథర్వ మురళి తెలుగులో గద్దల కొండ గణేశ్ సినిమాలో నటించాడు.
తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తెలుగు సినిమా చేస్తున్నాడు. లవ్ స్టోరీని నిర్మించిన ఏషియన్ ఫిలింస్ నిర్మాతలే ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు శేఖర్ కమ్ముల.
దళపతి విజయ్ కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా త్వరలోనే మొదలు కానుంది. దీని కోసం ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయయమైన శివ కార్తికేయన్.. డబ్బింగ్ సినిమాలతో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఆ మధ్య ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో అతిథి పాత్రలో మెరిశాడు. ఇప్పుడు ఈయనతో నేరుగా ఓ తెలుగు సినిమా నిర్మించడానికి ఒక అగ్ర నిర్మాణ సంస్థ సిద్ధమైంది. జాతి రత్నాలు సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అనుదీప్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. దీనికోసం శివ కార్తికేయన్ ఏకంగా రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి 1992లోనే తెలుగు సినిమాలో నటించాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతికిరణం సినిమాలో తన నటనతో మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు వైఎస్ఆర్ బయోపిక్ యాత్రతో మళ్లీ తెలుగు తెరపై కనిపించాడు.
అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో 1994లో వచ్చిన గాండీవం సినిమాలో ఒక పాటతో టాలీవుడ్కు గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు మోహన్ లాల్. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలతో పలకరించిన మోహన్లాల్.. ఎన్టీఆర్తో కలిసి జనతా గ్యారేజితో తెలుగులో కనిపించాడు. ఈ సినిమాతో పాటే మనమంతా సినిమాలోనూ నటించాడు మోహన్లాల్.
శ్రీరామ్ హీరోగా వచ్చిన పోలీస్ పోలీస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు పృథ్వీరాజ్ సుకుమారన్. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
మలయాళంలో విలక్షణ నటుడిగా పేరున్న ఫహాద్ ఫాజిల్.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
కన్నడ హీరో ఉపేంద్ర గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈయన కన్యాదానం, ఒకేమాట, రా, నీతోనే ఉంటాను, టాస్ వంటి తెలుగు సినిమాల్లో నటించాడు. చివరగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కనిపించాడు.
రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు కన్నడ స్టార్ సుదీప్. ఆ తర్వాత ఈగ సినిమాతో విలనిజం పండించాడు. ఇవే కాకుండా బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల్లోనూ నటించాడు సుదీప్.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనం సినిమాతో తెలుగు తెరపై మెరిశాడు. ఆ తర్వాత చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలోనూ నటించాడు అమితాబ్.
కెరీర్ తొలినాళ్లలోనే వంశవృక్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు అనిల్ కపూర్. ఆ తర్వాత బాలీవుడ్లోనే సెటిల్ అయ్యాడు.
రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చాడు వివేక్ ఒబెరాయ్. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో విలన్గా కనిపించాడు వివేక్ ఒబెరాయ్.
బాలీవుడ్ను ఒక ఊపు ఊపిన మిథున్ చక్రవర్తి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తున్నాడు. ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్గా వచ్చిన గోపాల గోపాల చిత్రంలో స్వామిజీ పాత్రలో మిథున్ కనిపించాడు.
నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు సంజయ్ దత్. నాగార్జునతో ఉన్న స్నేహం కారణంగా ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించేందుకు ఒప్పుకున్నాడు సంజయ్ దత్.
మంచు విష్ణు, కాజల్ అక్కాతమ్ముళ్లుగా నటించిన మోసగాళ్లు సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు సునీల్ శెట్టి. ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమాలో సునీల్ శెట్టి కీలకపాత్రలో నటిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తెలుగు ఇండస్ట్రీకి మరో తమిళ హీరో.. 20 కోట్ల రెమ్యునరేషన్
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో రాశీఖన్నా..?
Bigg boss | బిగ్ బాస్ అప్డేట్.. కంటెస్టెంట్స్ వీళ్ళేనా ?
ఒకే ఒక్కడు రేంజ్లో చరణ్-శంకర్ మూవీ..!
ప్రకాశ్ రాజ్కు విజన్ ఉంది,అందుకే సపోర్ట్ చేస్తున్నాను: నాగబాబు
కోట్లు సంపాదించా.. ఇంటి అద్దె కట్టలేనా.. ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి