కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొందరికి సమయానికి వైద్యం దొరక్క చనిపోతుంటే మరి కొందరు ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు అవసరమైన వారికి ఆక్సిజన్ అందించేందుకు చాలా కృషి చేస్తున్నారు. సోనూసూద్, చిరంజీవి వంటి వారు ప్రత్యేక ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఆక్సిజన్ కొరత రాకుండా చూస్తున్నారు.
కరోనా రోగులకు ఆక్సిజన్ కోరతను నివారించడానికి ఇప్పటికే పలు చోట్లు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టిన సోనూసూద్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ కొరత కేవలం కొన్ని రాష్ట్రాలలోనే కాదు దేశమంతటా ఉంది కాబట్టి డీటీడీసీ కొరియర్ ద్వారా ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులకు భారతదేశ వ్యాప్తంగా సిలిండర్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారు www.umeedysonusood.com కు లాగిన్ అయితే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను డీటీడీసీ ద్వారా ఉచితంగా పంపిస్తానని సోనూసూద్ చెబుతున్నారు. ఆయన చేస్తున్న కృషిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.