దక్షిణాది ఇండస్ట్రీలో నయనతార (Nayanthara)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించుకున్న ఈమె..ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్యే దర్శకుడు విగ్నేష్ శివన్ (vignesh shivan)ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ..భర్తతో కలిసి థాయిలాండ్ కు వెళ్లి వచ్చింది. హనీమూన్ ఫుల్లుగా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత..వెంటనే సినిమాలతో బిజీ అయిపోయింది ఈ భామ. పెళ్లి తర్వాత కనీసం రెండు నెలల పాటు అయినా సినిమాలకు దూరంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ నెల రోజులలోపే షూటింగ్ కు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది నయనతార.
ప్రస్తుతం ఈమె హిందీలో షారుక్ ఖాన్ (Shah Rukh khan) హీరోగా నటిస్తున్న జవాన్ (jawan )సినిమాతో బిజీగా ఉంది. దీంతో పాటు ఒక మలయాళ సినిమాలో కూడా నటిస్తోంది. తెలుగులో చిరంజీవితో నటిస్తున్న గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తయింది. అందులో చిరంజీవి నయనతార అన్నా చెల్లెళ్లుగా నటిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈమె ముంబైలో ఉంది. హనీమూన్ అయిపోయిన తర్వాత నేరుగా షారుక్ ఖాన్ సినిమా లొకేషన్ కి వెళ్ళింది నయనతార. ముంబై ఫిలిం సిటీలో జరుగుతున్న జవాన్ సినిమా సెట్లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తమిళ దర్శకుడు అట్లీ (Atlee) ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచనాలు పెంచేసింది.
హిందీలో నయనతార నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇప్పటి వరకు ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా కాదనుకున్న ఈ బ్యూటీ.. అట్లీ కోసం బాలీవుడ్ వెళుతుంది. ఆయన అడిగిన వెంటనే కాదనలేకపోయింది ఈ బ్యూటీ. జవాన్ సినిమా కోసం నయనతార దాదాపు 8 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా పెళ్లి తర్వాత ఇంత త్వరగా షూటింగ్ కు వచ్చిన తర్వాత నయనతారను చూసి యూనిట్ సభ్యులు కూడా షాక్ అవుతున్నారు.