రాయ్పూర్: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ప్రతి రోజు మూడు లక్షలకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ విస్తృతికి కొత్త వేరియంటే కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్440 అనే వైరస్ రకాన్ని కనుగొన్నారు. ఇది సాధారణం కన్నా 15 రెట్లు వేగంగా విస్తరిస్తున్నదని, దీనివల్ల చాలా రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తరకం కరోనా వేరియంట్ విజృంభిస్తుండటంతో పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ అప్రమత్తమయ్యింది. ఏపీతో సరిహద్దు కలిగిన సుక్మా జిల్లా బార్డర్లను మూసివేసింది. ఆంధ్రప్రదేశ్ స్ట్రెయిన్ కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో సరిహద్దులను బంద్ చేశామని జిల్లా మేజిస్ట్రేట్ వినీత్ నందన్వార్ వెల్లడించారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు లేనివారిని జిల్లాలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
దేశంలో కనుగొన్న ఈ కొత్తరకం వైరస్ వీ1.617, వీ1.618 రకం వైరస్ల కంటే చాలా ప్రమాదకరమైనదని సీసీఎంబీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వైరస్ సోకిన వ్యక్తి మూడు నాలుగు రోజుల్లోనే ఆక్సిజన్ తీసుకోవడానికి ఇబ్బంది పడతాడని తెలిపారు. దీనిని మొదటిసారిగా ఏపీలోని కర్నూలు జిల్లాలో గుర్తించామన్నారు. తర్వాత ఈ రకం వైరస్ మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపిస్తున్నదని చెప్పారు. అందువల్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి