ప్రజాప్రతినిధులు దళిత వాడల్లో పర్యటించాలి
రాష్ట్రంలో రూ.1200 కోట్లతో పథకం రూపకల్పన
ఎస్సీ సబ్ప్లాన్కు ఈ నిధులు అదనం : మంత్రి అజయ్
అభినవ అంబేడ్కర్ సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం, జూన్ 29: తెలంగాణలోని దళితులను అభివృద్ధి చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1200 కోట్లతో సీఎం దళిత ఎంపవర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే నూతన చరిత్రకు నాంది పలికారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చాక అనేక ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేసినా వాటి ద్వారా వారి జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. సబ్సిడీలకు బ్యాంకు లింకేజీలు ముడి పెట్టడం ద్వారా అనేకమంది దళితులు ఆ పథకాల వల్ల లబ్ధిపొందలేకపోయారని అన్నారు. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దళితులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నూతన పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ విషయంపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు దళిత వాడల్లో పర్యటించి దళితులకు అవగాహన కల్పించాలని సూచించారు. దళిత సంఘాల నాయకులు, దళిత మేధావులు, వివిధ సామాజిక వర్గాల బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని దళితులకు చైతన్యం కల్పించడంతో పాటుగా ప్రభుత్వానికి కూడా సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది చొప్పున రాష్ట్రంలో 11,900 మందికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసి వారికి ఇష్టమైన రంగాల్లో, ఇష్టమైన వ్యాపారాల్లో శిక్షణ ఇచ్చి వారిని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఎస్సీ సబ్ ప్లాన్కు ఈ రూ.1200 కోట్లు అదనమని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.
అభినవ అంబేద్కర్.. సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే సండ్ర
సీఎం దళిత ఎంపవర్పెంట్ పథకం ద్వారా అభినవ అంబేద్కర్గా సీఎం కేసీఆర్ కీర్తి గడించారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఈ పథకం ద్వారా దళితుల బతుకుల్లో సువర్ణాధ్యాయం ప్రారంభమైందన్నారు. ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లింగాల రవికుమార్, కార్పొరేటర్ బుర్రి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్తో పేదలకు భరోసా: మంత్రి అజయ్
సీఎంఆర్ఎఫ్తో పేదలకు భరోసా కలుగుతోందని మంత్రి అజయ్కుమార్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరలాంటిదని అన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో 92 మంది లబ్ధిదారులకు రూ.33.75 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మేయర్ నీరజ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ, కొత్తపల్లి నీరజ, రామ్మోహన్, రఘునాథపాలెం జడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీప గౌరీ తదితరులు పాల్గొన్నారు.