బాన్సువాడ/ బాన్సువాడ టౌన్/నస్రుల్లాబాద్, మే 4: బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికలలోపు బిల్లులు రాకపోతే మే 13 ఓటింగ్ తర్వాత తన కుటుంబ సభ్యులు, లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తానని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు.
శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్లో జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి రోడ్షో, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. ప్రజలను రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బాన్సువాడలో నిర్వహించిన రోడ్డు షో, కార్నర్ మీటింగ్ సందర్భంగా నిర్వహించిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ప్రచారంలో బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.