సూర్యాపేట, మే 4 : పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సూచించారు. శనివారం స్థానిక ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులతోపాటు ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగం కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ కోసం పీఓ,ఏపీఓలకు మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఈ నెల 8 వరకు తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు దాదాపు 275 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. శిక్షణ తరగతులకు హాజరు కాని సిబ్బంది ఈ నెల 7న ఉదయం 10 గంటలకు సూర్యాపేటలోని ఎస్వీ కళాశాలలో నిర్వహించే శిక్షణకు హాజరు కావాలని, లేకుంటే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, తాసీల్దార్లు శ్యాంసుందర్రెడ్డి, కృష్ణయ్య, మహేందర్రెడ్డి, ఎన్నికల సిబ్బంది, ఎస్ఎల్ఎంటీలు పాల్గొన్నారు.