ప్రజాప్రతినిధులు అండగా ఉండాలి
ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు
చివరి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొంటుంది
రైతుల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం
జనగామ జిల్లా వైద్యశాలకు అవార్డు రావడం అభినందనీయం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కొడకండ్ల, మే 30 : ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన కొడకండ్ల మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రారంభించారు. ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం నిత్యావసర సరుకులు, పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కరోనా బాధితులకు ప్రజాప్రతినిధులు అండగా నిలువాలని కోరారు. ప్రైవేటు దవాఖానల కంటే ప్రభుత్వ వైద్యశాలల్లో వసతులు మెరుగ్గా ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు అవార్డు కైవసం చేసుకొని, కేంద్రం నుంచి రూ.25లక్షల గ్రాంటు పొందిందన్నారు. ఇందుకు కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. కొడకండ్ల మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల వైద్యశాలగా మార్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆరోగ్య కేంద్రానికి అవసరమైనన్ని ఆక్సిజన్ సిలిండర్లు పంపిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందన్నారు.
మన దేశంలో తయారైన వ్యాక్సిన్ల ఇతర దేశాలకు ఎగుమతి చేయడం దురదృష్టకరమన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవని, రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కొందరు కుట్రపూరితంగా రైతులమని చెప్పి ధాన్యం కాలబెట్టడం సరికాదన్నారు. బీజేపీ నేతలు మాయమాటలతో రైతులను మభ్యపెడుతున్నారని, వారిని నమ్మొద్దన్నారు. ఎంతనష్టం జరిగినా కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని, చివరి ధాన్యపు గింజవరకూ ప్రభుత్వమే కొంటుందని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. లారీలు, గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలోని మండల వైద్యాధికారి డా. భాస్కర్, సిబ్బంది, కరోనా బాధితులకు సేవలందిస్తున్న ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో పీడీ రాంరెడ్డి, డీఎంహెచ్వో మహేందర్, డీపీవో రంగాచారి, ఏఎంసీ చైర్మన్ పేరం రాము, ఎంపీపీ జ్యోతీరవీంద్రగాంధీనాయక్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రామోజీ, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.